Konda Surekha :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొండా సురేఖకు  గాయాలయ్యాయి. రాహుల్ గాంధీ చేపట్టిన  బస్సు యాత్రలో భాగంగా భూపాలపల్లిలో నిర్వహించిన బైక్ ర్యాలీలో స్వయంగా పాల్గొన్నారు. బైక్ నడిపారు. అయితే వందల మంది పార్టీ కార్యకర్తలు  బైక్ ర్యాలీలో పాల్గొనడంతో.. ఓ సందర్భంగా బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో కొండా సురేఖకు గాయాలయ్యాయి. ఆమెను తక్షణం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్‌ నేతలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జెన్‌కో అతిథిగృహం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు ఇది కొనసాగింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేత మధుయాష్కీతో పాటు మరికొందరు ముఖ్యనేతలు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీకి తరలివచ్చారు. కొండా మురళి దంపతులు కూడా.. తమ  అనుచరులతో భూపాలపల్లికి ర్యాలీగా వచ్చారు. ఈ ర్యాలీలో అందరితో పాటు కొండా సురేఖ కూడా  బైక్ నడిపే ప్రయత్నం  చేయడంతో ప్రమాదం జరిగింది. 


చాలా ఏళ్లుగా కొండా సురేఖ బైక్ నడపలేదు. బైక్ నడపడం ప్రాక్టీస్ లేకపోవడంతో.. తడబడటంతో ప్రమాదం జరిగింది. అయితే వెంటనే.. పక్కన ఉన్న  వారు గుర్తించి.. ఇతర వాహనాలు రాకుండా కంట్రోల్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. తలకు.. చేతికి చిన్న చిన్న గాయాలు మాత్రమే అయ్యాయని.. ఇతర సమస్యలు ఏమీ లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 


రాహుల్‌ విజయభేరి బస్సుయాత్ర రెండోరోజు భూపాలపల్లి నుంచి కాటారం వరకు కొనసాగనుంది. కేటీకే 5వ గని నుంచి బాంబుల గడ్డ వరకు రాహుల్‌ గాంధీ నిరుద్యోగులతో బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. జెన్‌ కో అతిథి గృహం నుంచి అంబేద్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. బైక్‌ ర్యాలీలో రాహుల్‌ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, భట్టి, ఉత్తమ్‌, మధుయాష్కీ పాల్గొన్నారు. కాటారం జంక్షన్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. రోడ్డుపై ఎండలోనే ఆయన మాట్లాడటం గమనార్హం. కాగా.. రాహుల్ మాట్లాడుతూ.. ఇది దొరల తెలంగాణ... ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతోందన్నారు. ఒకే కుటుంబం పాలిస్తోందన్నారు. ఇక్కడ అవినీతి రాజ్యామేలుతోందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని రాహుల్ అన్నారు. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు పెడుతున్నారన్నారు. కానీ సీఎం కేసీఆర్ పై ఒక్కకేసు లేదన్నారు. తనపై 24 కేసులు పెట్టారన్నారు. రాజ్యసభ సభ్యత్వం రద్దు చేశారని.. ఇల్లు లాక్కున్నారని అన్నారు. బీజేపీ-ఎంఐఎం సరస్పర సహకారం అందించుకుంటున్నాయన్నారు. పార్లమెంటులో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోందని రాహుల్ గాంధీ అన్నారు.