KCR Calls Kavitha :   గురువారం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ అయిన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌తో  సంప్రదించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు వెళ్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆమె నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు. అంతకు ముందు .. ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడినట్లుగా బీఆర్ఎస్  పార్టీ వర్గాలుచెబుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆందోళన చెందాల్సిన పని లేదని..  మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాటాన్ని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాను యధావిధిగా కొనసాగించాలని కేసీఆర్ కవితకు సూచించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. 

భారతీయ జనతా పార్టీ ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడుదామని...  భారత రాష్ట్ర సమితి..  పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని కేసీఆర్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేసీఆర్‌తో మాట్లాడిన తర్వాత కవిత ఢిల్లీ బయలుదేరారు. రాజకీయ రంగంలో మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు ను పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న  డిమాండ్ తో  ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్  వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది . ఈ దీక్ష కోసమే కవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.                                  

ముందుగా నిర్ణయించుకున్నట్లుగా  జంతర్ మంతర్‌లో ధర్నా ఉన్నందున  మార్చి 9న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడీ జారీ చేసిన నోటీసుల విషయంలో కవిత రిక్వెస్ట్ లెటర్ పంపారు.  చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్‌మెంట్ల‌ రీత్యా విచారణకు హాజరయ్యే తేదీ విషయంలో మార్పు కోరారు. పదిహేనో తేదీ తర్వాత తాను విచారణకు  హాజరవుతానని లేఖలో కోరారు. దీనిపై ఈడీ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. ఈడీ స్పందించకపోతే కవిత విచారణకు  హాజరయ్యే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. విచారణకు సహకరించడం లేదని ఈడీ ఆరోపిస్తే కేసు క్లిష్టంగా మారుతుంది. అయితే ఈడీ స్పందించి.. గడువు ఇస్తే.. మహిళా రిజర్వేషన్ల అంశంపై ధర్నా తర్వాత ఈడీ ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. 

కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులు జారీ చేయడానికి పూర్తిగా రాజకీయ కారణాలే  కారణం అని అటు సీఎం కేసీఆర్ తో పాటు ఇటు బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. గతంలోనూ బీజేపీ నేతలు కవితను పార్టీ మారని అడిగారని కేసీఆర్ పార్టీ నేతలకు తెలిపారు. ఈ కారణంగా ఈ అంశాన్నిపూర్తిగా రాజకీయ కోణంలోనే చూడాలని బీఆర్ఎస్ నేతలు నిర్ణయించుకున్నారు. అందుకే.. బీజేపీపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు.                             

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు- రేపు విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు