Jagruti Kavitha Rail Roko: తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తున్న కవిత ముందుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం ప్రారంభించాలని నిర్ణయించారు. జూలై 17న రాష్ట్ర వ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మెదక్లో బీసీ సంఘాలతో సమావేశమైన కవిత కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లపై బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తీవ్ర తరం చేయాలని నిర్ణయించారు. అన్ని బీసీ సంఘాల నాయకులను కలుపుకొని రైల్ రోకో చేస్తామని.. ఢిల్లీ పాలకులకు తెలంగాణ బీసీల పౌరుషాన్ని చాటుతామని కవిత ప్రకటించారు. ఢిల్లీ పాలనలకు సెగ తాకేలా రైల్ రోకో ఉంటుందని.. 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలు నిర్వహించనివ్వబోమని కవిత స్పష్టం చేశారు. 42 రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని.. బీసీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున కలిసిరావాలని పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ జాగృతి పోరాటం చేస్తోందని.. తెలంగాణ జాగృతి, యూపీఎఫ్ ఒత్తిడితోనూ అసెంబ్లీలో ప్రభుత్వం మూడు బీసీ బిల్లులు పెట్టిందని గుర్తు చేశారు. వార్డు మెంబర్, సర్పంచ్ లు కాని అనేక కులాలు బీసీల్లో ఉన్నాయని.. అసెంబ్లీ గడప తొక్కని అనేక కులాలు ఉన్నాయని గుర్తు చేశారు. రాజకీయ అవకాశాల్లో బీసీ మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీలకు ఉప కోటా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. జాగృతి రాజకీయ వేదిక కాదు... ఇది మానవ హక్కలు, సామాజిక హక్కలు వేదికన్నారు. సమాజంలో 56 శాతం జనాభాకు సంబంధించి హక్కులు కోరుతుంటే అవి మానవ హక్కులు కావా అని ప్రశ్నించారు.
ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది... కాబట్టి అందరూ కలిసికట్టుగా హక్కల కోసం పోరాటం చేయాలని.. సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి అసెంబ్లీలో మూడు బిల్లులు వచ్చాయన్నారు. అదే స్పూర్తితో బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని.. ఢిల్లీకి బిల్లు పంపించి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులుదులుపుకుందని మండిపడ్డారు. మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీసీ బిల్లు గురించి ఒక్క రోజు కూడా మాట్లాడలేదు.. రఘునందన్ రావు బీసీల కోసం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ప్రతీ ఒక్కరు రఘునందన్ రావును ప్రశ్నించాలన్నారు. కులగణన వివరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశానికి రానివ్వకుండా బీసీ నాయకులను మెదక్ లొ కొంత మంది బెదిరించే ప్రయత్నం చేశారు.. దీన్న బట్టే వాళ్లు భయపడుతున్నారని అర్థమవుతోందని విమర్శించారు.
కవిత నేరుగా రైల్ రోకో పేరుతో ఉద్యమం ప్రకటించడంతో .. ఇక తన రాజకీయ కార్యాచరణను కవిత ప్రారంభించినట్లయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశం ద్వారా జాగృతికి గట్టి బేస్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని భావిస్తున్నారు.