Warangal Karimnagar Smart City Mission | హైదరాబాద్: స్మార్ట్ సిటీ మిష‌న్ ను 2025 మార్చి వరకు పొడిగించేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇటీవల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా జూన్ 24న కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహల్లాల్ ఖట్టర్ ను కలిశారు.  స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని 2025 జూన్ నెల వరకు పొడిగించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 


ఈ జూన్ నెలతో ముగియనున్న గడువు 
కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు ప్రకారం స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితి ఈ జూన్ నెలతో ముగియనుంది. తెలంగాణలో వరంగల్, కరీంనగర్​నగరాల్లో కేంద్రం సూచనతో స్మార్ట్ మిషన్  పనులు చేపట్టారు. వరంగల్ లో ఇప్పటివరకు 45 పనులు పూర్తి కాగా, 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు జరుగుతున్నాయి. కరీంనగర్ లో ఇప్పటివరకూ 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన 22 పనులు కరీంనగర్ లో జరుగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి తెలిపారు.


అయితే ప్రస్తుతం కొనసాగుతున్న స్మార్ట్ సిటీ మిషన్​గడువు ముగుస్తున్నా.. స్ట్మార్ట్ సిటీలో భాగంగా చేపట్టిన పనులు పూర్తి కాలేదని, ప్రజా ప్రయోజనాల కోసం పనులు పూర్తయ్యే వరకు  గడువు పొడిగించాలని కేంద్రాన్ని రేవంత్ రెడ్డి కోరారు. సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ పై స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు శనివారం సంబంధిత రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే ఆమోదం పొంది, నిధులు కేటాయించిన పనులను కొనసాగించాలన్నారు. దాంతో పాటు కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం కరీంనగర్, వరంగల్ లలో జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ పద్ధతిన విడుదల చేయనున్నారు.  కనుక ఆ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించింది. 
Also Read: కమీషన్లు తీసుకుంటే ఖబర్దార్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్