Bandi Sanjay about Delimitation |  కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, ఆప్, సీపీఎం పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. లిక్కర్ దొంగలంతా ఒకే చోట సమావేశమై డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ‘‘స్టాలిన్ ప్రభుత్వం రూ.1000 కోట్ల లిక్కర్ స్కాం చేసింది. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడింది. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయింది. వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతూ మోదీ ప్రభుత్వంపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు’’అని దుయ్యబట్టారు. వాళ్లంతా దేశ జీడీపీకి, పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి లింకు పెట్టడంపై మండిపడ్డారు.


లిక్కర్ దొంగల ముఠా సమావేశం..


‘‘చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో లిక్కర్ దొంగల ముఠా ఒకే చోట సమావేశమై విచిత్రమైన తీర్మానం చేశారు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం? దేశ జీడీపీకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీలో వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా ? ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది?’’ అని ఫైర్ అయ్యారు.


కరీంనగర్ లోని శుభం గార్డెన్ లో ఆదివారం మధ్యాహ్నం తపస్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. టీచర్ల దమ్మేందో, తపస్ అనే ఉపాధ్యాయ సంఘం తలుచుకుంటే ఏమైతదో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులారా... మీరంతా ఏ సంఘంవైపు చూడకండి. జాతీయవాద భావజాలం, టీచర్ల కోసం కొట్లాడే ఏకైక సంఘం తపస్. ఆ సంఘంలోనే చేరాలని కోరుతున్నా. మీకోసం కొట్లాడేది, దెబ్బలు తినేది, జైలుకు కూడా పోయేందుకు వెనుకాడని నాయకులు తపస్ మాత్రమే. అందుకే తపస్ బలపర్చిన అభ్యర్ధి మల్క కొమరయ్యకు టిక్కెట్ ఇప్పించి సునాయాసంగా గెలిపించింది. తపస్ ను రాష్ట్రంలో నెంబర్ వన్ సంఘంగా మార్చి తీరుతాం. 


కేసీఆర్ కుటుంబ పాలనతో సర్వ నాశనం


తెలంగాణ సాధనలో టీచర్ల, ఉద్యోగుల పాత్ర మరువలేం. 42 రోజుల సకల జనుల సమ్మె చేసి తెగించి కొట్లాడి రాష్ట్రం సాధించుకున్నరు. కానీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబ పాలనతో సర్వ నాశనమైంది. బీదర్ లో ఒక ప్రింటింగ్ ప్రెస్ లో దొంగ నోట్లు ముద్రిస్తారు. అది బీఆర్ఎస్ నేతది. ఆ ప్రింటింగ్ ప్రెస్ ను మూసివేసేందుకు రాష్ట్ర పోలీసులు వెళితే... బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఫోన్ చేసి అక్కడికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. గత ఎన్నికల్లో పంచిన నోట్లన్నీ దొంగ నోట్లే. 
కాంగ్రెస్ కు అధికారం అప్పగిస్తే ఏం ఒరిగింది? కేసీఆర్ పాలనలో తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందని చెప్పారు రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను తీర్చడంతోపాటు 6 గ్యారంటీలను కూడా అమలు చేసి తీరుతామని ప్రకటించారు. కానీ ఏమైంది? 15 నెలలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను దారుణంగా వంచిస్తూనే ఉన్నడు. 


5 డీఏలు ఎందుకు పెండింగ్


విద్యాశాఖకు అసలు మంత్రి కూడా లేదు. ఆయనే ఆ శాఖ మంత్రిగా ఉన్నా టీచర్లకు ఒరిగిందేమీ లేదు. కేంద్రం ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏ ఇస్తోంది... ప్రధాని మోదీపై విషం కక్కే కాంగ్రెస్ ప్రభుత్వం 5 డీఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టారు? మరో 3 నెలలైతే జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. టీచర్ల, ఉద్యోగుల పెండింగ్ బిల్స్ మొత్తం రూ.8వేల కోట్లు. అట్లాగే రిటైర్డ్ మెంట్ బెన్ పిట్స్ బకాయిలు రూ.11 వేల కోట్లు. వీళ్లకు పైసలు ఇవ్వమంటే డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం 18 శాతం కమీషన్ ఇస్తే మాత్రం కాంట్రాక్టర్లకు బిల్స్ క్లియర్ చేస్తోంది. ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వడం లేదు. ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలివ్వడం లేదు. కేజీబీవీ టీచర్ల బాధలు వర్ణణాతీం. ఈ సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ అధికారి యోగితారాణాకు నేనే ఫోన్ చేసిన. ఆ సమస్య పరిష్కారం కోసం క్రుషి చేస్తా.


విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్
టీచర్లను, తపస్ నాయకులను కోరేదొక్కటే... సమస్యలపై పోరాడండి. తపస్ తల్చుకుంటే విద్యాశాఖను సమూలంగా ప్రక్షాళన కావాలి. టీచర్ల సమస్యలు పరిష్కారం కావాలే. ప్రభుత్వం ఉద్యోగం నుండి తీసేస్తదనే భయం మీకు వద్దు. మిమ్ముల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఎందుకంటే విద్యా శాఖను అర్బన్ నక్సల్స్ చేతిలో పెట్టి తుపాకీ రాజ్యం తేవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మోదీ ప్రభుత్వం విద్యార్థులకు కలం అందించి మహానుభావులుగా తీర్చిదిద్దాలని చూస్తుంటే... కాంగ్రెస్ అందుకు భిన్నంగా పాఠ్యపుస్తకాల్లో అర్బన్ నక్సల్స్ భావజాలాన్ని జొప్పించి తుపాకీ రాజ్యం కోసం కుట్రలు చేస్తుంటే సమాజానికి ఏ సందేశం పంపినట్లు? అసలు ఏ ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అర్బన్ నక్సల్స్ ను విద్యా కమిషన్ లో నియమించారో సమాధానం చెప్పాలి. ఈ విధానాన్ని తపస్ కచ్చితంగా వ్యతిరేకించి ఉద్యమం ప్రారంభించాలి. 


ఎంతకాలం బతికామన్నది కాదు.. బతికి ఉన్నంత కాలం జీవితమంతా స్పూర్తిదాయకంగా ఉండేలా పోరాడాలి. హీరోలెక్క బతకాలే తప్ప జీరో కావొద్దు. 317 జీవోసహా టీచర్ల సమస్యలపై నిరంతరం పోరాడి జైలుకు పోయింది బీజేపీయే. ప్రజల కోసం కొట్లాడితే నాపై 109 కేసులు పెట్టారు. తపస్ నాయకులు కూడా టీచర్ల సమస్యలపై, ప్రజల కోసం పోరాడండి. ఉద్యోగం కోల్పోతే వాళ్లకే భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమనే తేలిపోయింది. 


రుణమాఫీ అర్హుల జాబితా 42 లక్షలు
 కాంగ్రెస్ చేసిన మోసాలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీని పూర్తిగా అమలు  చేసినట్లు ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2 లక్షల రుణమాఫీ అర్హుల జాబితా 42 లక్షలు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే 31 వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ఇప్పటి వరకు 25 లక్షల 35 వేల మందికి  20 వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. మరి మిగిలిన 16 లక్షల 65 వేల మంది పరిస్థితి ఏంది? వీళ్లకు రుణమాఫీ కావాలంటే రూ.10 వేల కోట్లు కావాలి. కానీ వీళ్లకు నయాపైసా చెల్లించకుండా రుణమాఫీ పూర్తయిందని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించడం సిగ్గు చేటు. లక్షల మంది రైతులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర్లో పడ్డాయి. 


వాళ్లంతా లిక్కర్ స్కాం దొంగలే..


చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దొంగల ముఠా విచిత్రమైన తీర్మానం చేశారు. వాళ్లంతా లిక్కర్ స్కాం దొంగలే. స్టాలిన్ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల లిక్కర్ స్కాం చేసింది. కేరళలోనూ లిక్కర్ స్కాం బయటపడింది. ఆప్, బీఆర్ఎస్ నేతలు ఆల్రెడీ లిక్కర్ స్కాం చేసి జైలుకు పోయింది. వీళ్లంతా కలిసి డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నరు. దేశ జీడీపీలో దక్షిణాది వాటా 36 శాతం ఉన్నందున పార్లమెంట్ లో కూడా దక్షిణాదికి 36 శాతందాకా వాటా ఇవ్వాలని అడుగుతున్నరు. ఇదేం విచిత్రం. దేశ జీడీపీకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యానికి సంబంధమేంది? అట్లనుకుంటే తెలంగాణ జీడీపీ(Gross domestic product) వెనుకబడ్డ ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల జీడీపీ ప్రాతినిధ్యం చాలా తక్కువ. అంత మాత్రాన అసెంబ్లీలో వాటికి ప్రాతినిధ్యం ఉండకూడదా? ఇదెక్కడికి దిక్కుమాలిన ప్రతిపాదన? దక్షిణాది పేరుతో రాజకీయాలు చేస్తూ డీలిమిటేషన్ ను అడ్డుకునే కుట్రలు చేయడమేంది?
ఒకవైపు రాష్ట్రంలో జనం అల్లాడుతున్నరు. సాగు నీరందక రైతులు 10 లక్షలకుపైగా పంట నష్టపోయిర్రు. నిన్న, మొన్న కురిసిన అకాల వర్షాలతో మళ్లీ పంట దెబ్బతిన్నది.


ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది పేద రోగులు ట్రీట్ మెంట్ కు నోచుకోవడం లేదు.  పెండింగ్ లో ఉన్న వేల కోట్ల రూపాయల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు చదువుకు దూరమైతున్నరు. కాలేజీలు మూతపడుతున్నయి. పెండింగ్ బిల్స్ చెల్లించకపోవడంతో వేలాది మంది మాజీ సర్పంచులు అప్పులపాలై బజారునపడ్డరు. చాలీచాలని వేతనాలతో అంగన్ వాడీలు, ఆశావర్కర్లు రోడ్లపై ధర్నా చేస్తూ ఆర్తనాదాలు చేస్తున్నరు. ఉద్యోగాలు రాక లక్షల మంది నిరుద్యోగులు అరిగోస పడుతున్నరు. పీఆర్సీ అమలుకాక, 5 డీఏలు అందక, దాచుకున్న జీపీఎఫ్ పైసలందక లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు బాధపడుతున్నరు. 
రాష్ట్రంలో ఇన్ని సమస్యలుంటే ఇవేమీ పట్టని కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు చెట్టాపట్టాలేసుకుని చెన్నై పోయి డీలిమిటేషన్ పేరుతో రాజకీయాలు చేస్తారా? మోదీ ప్రభుత్వంపై విషం కక్కడం తప్ప ప్రజలుకు ఈరెండు పార్టీలు చేస్తున్నదేమిటి?. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.