కరీంనగర్ నగరాన్ని ప్రపంచపర్యాటక పటంలో అత్యుత్తమంగా నిలిపేలా మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రూపుదాల్చనుందన్నారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. ఫస్ట్ ఫేజ్‌లోని 4 కిలోమీటర్ల మేర 410 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న మానేర్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే సర్వే పనులు ముగించుకొని ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులపై మంత్రి గంగుల కమలాకర్ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. డిజైన్ కన్సల్టెన్సీ, ఎజెన్సీ, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో ప్రాజెక్ట్ పురోగతిపై మాట్లాడారు. లైటింగ్, ఫౌంటెయిన్ ఏర్పాట్లు, డిజైన్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యంత వేగంగా నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని వాళ్లను ఆదేశించారు. కరీంనగర్ వాసులకు అహ్లాదకరమైన టూరిజం స్పాట్ అందుబాటులోకి రానుందన్నారు మంత్రి గంగుల కమలాకర్.


వేగంగా ప్రాజెక్టు పనులు


మానేరు నదిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టు పనులు చేపట్టింది. ఈ ప్రాజెక్టును మార్చి 17న తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చెక్‌ డ్యాంల నిర్మాణం నదికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్స్‌ పనులు చకచకా సాగుతున్నాయి. గత రెండు నెలలుగా బేస్‌మెంట్‌ పనులు చేపట్టారు. 


రూ. 410 కోట్లతో పనులు


కరీంనగర్‌లోని మానేరు నదిపై రూ.410 కోట్లతో మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి విడతలో ఎల్‌ఎండీ డ్యాం నుంచి నాలుగు కిలోమీటర్ల మేరకు రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మిస్తున్నారు. దీనికి రూ.310.46 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం అల్గునూర్‌, సదాశివపల్లివైపుగా రిటైనింగ్‌ వాల్స్‌ నిర్మాణానికి సంబంధించి పనులను మంత్రి సమీక్షించారు. 


ప్రస్తుతం నాలుగున్నర మీటర్ల ఎత్తు మొదటగా ఈ వాల్స్‌ నిర్మించిన తర్వాత మరో ఎత్తులో మరో వాల్‌ నిర్మించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ వానకాలంలోగా సాధ్యమైనంత మేరకు వాల్స్‌ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ చెబుతోంది. నది లోతును పెంచేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడతలో చేపడుతున్న పనులు ఏడాదిన్నరలోపే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఈ పనులకు సమాంతరంగా రూ.80 కోట్ల వ్యయంతో చెక్‌ డ్యాంలు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో వాటర్‌ ఫౌంటెయిన్, బోటింగ్‌, కాటేజీలతోపాటుగా ప్రపంచ స్థాయిలో థీమ్‌ పార్కులు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.