రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ యువతిని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం కలిగించింది. చందుర్తి మండలంలోని మూడపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య అనే వ్యక్తి తన కూతురుతో కలిసి ఈ రోజు (డిసెంబరు 20) తెల్లవారుజామున గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజలు చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో కిడ్నాప్ ఘటన జరిగింది. అదే గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ అనే యువకుడు మరో నలుగురితో కలిసి ఆ యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశాడు. ప్రతిఘటించిన యువతి తండ్రిని నెట్టేసి మరీ పరారయ్యాడు. గతంలో ఆ యువతి తనను ప్రేమించి మోసం చేసి, తనపై అక్రమంగా కేసు నమోదు చేసిందని ఆ అక్కసుతోనే యువకుడు కిడ్నాప్ చేసి ఉంటాడని గ్రామస్థులు తెలిపారు. అదే అతణ్ని తీవ్రంగా మనస్తాపానికి గురి చేసిందని చెప్పారు. ఇదంతా మనసులో పెట్టుకొని అదను కోసం వేచి చూసిన జ్ఞానేశ్వర్ నేడు తెల్లవారుజామున తన మిత్రులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. యువతి తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా అప్పటికే కిడ్నాప్ గ్యాంగ్ స్విఫ్ట్ డిజైర్ కారులో కాపు కాసి ఉన్నారు. వారు గుడి నుంచి బయటికి రాగానే నిందితుల్ని చూసి పారిపోతున్న యువతిని పట్టుకొని బలవంతంగా కారు ఎక్కించారు. అడ్డుకోబోయిన ఆమె తండ్రిని కొట్టి దూరంగా నెట్టారు. 


ఇంకొంత మంది గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కిడ్నాప్ నకు గురైన యువతికి ఈ మధ్యనే పెళ్లి నిశ్చయం అయింది. ఆమె మైనర్ గా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై అప్పట్లో ఫోక్సో కేసు చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలోనే యువకుడు జైలుకి వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ యువకుడిపైనే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


పోలీసులు మాట్లాడుతూ.. రెండు బృందాలతో తనిఖీలు చేస్తున్నామని చెప్పారు. నేడు సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్నందున ఆ ప్రోగ్రామ్ పూర్తి కాగానే కిడ్నాప్ చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మూడపల్లికి చేరుకున్న అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి విచారణను కొనసాగిస్తున్నారు.


‘‘రోజూలాగే ఈ రోజు కూడా నేను, నా కూతురు కలిసి హనుమాన్ ఆలయానికి వెళ్లి వస్తుండగా కట్కూరి జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి కొట్టి, నా కుమార్తెను కిడ్నాప్ చేశాడు. ఆ సమయంలో కట్కూరి ప్రశాంత్, కట్కూరి జ్ఞానేశ్వర్ అనే ఇద్దర్ని మాత్రమే నేను చూడగలిగాను. ఇంకొక ఇద్దరు ఎవరో నేను చూడలేదు. ఎలాగైనా నా కూతుర్ని క్షేమంగా తీసుకురావాలి’’ అని యువతి తండ్రి చంద్రయ్య వేడుకున్నారు.