Pawan Kalyan Varahi vehicle: జనసేన సేనాని పవన్ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నారు. ఎన్నికల కోసం  ఊరూరా తిరిగేందుకు ప్రచార వాహనానికి వారాహి పేరు కూడా పెట్టారు. జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి తొలి పూజ చేయాలని పవన్ ఫిక్సయ్యారు. పవన్ కళ్యాణ్ కు అత్యంత ఇష్టమైన ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కొత్త ఏడాది జనవరి 2న కొండగట్టుకు వెళ్లి వారాహికి పూజలు చేస్తారు పవన్. తనకు అత్యంత ఇష్టమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో తొలి పూజలను నిర్ణయించిన తర్వాతనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల యుద్ధానికి బయలుదేరనున్నారు.


ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని సిద్ధం చేశారు. ఈ వాహనాన్ని పవన్ తనకు కావాల్సినట్లుగా తయారు చేయించారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించేందుకు ఇప్పటికే రెడీ అయిన పవన్ ఇక ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దం అవుతున్నారు. ఈ వాహనానికి అమ్మవారి పేరు పెట్టారు పవన్ కళ్యాణ్. అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి. దుర్గా దేవి సప్త మాతృకల్లో వారాహి అమ్మవారు ఒకరు... ఆ సప్త మాతృకలు రక్త బీజుడు అనే రాక్షసుడిని సంహరించారు.


వారాహి కలర్‌, ఇతర అంశాలపై తీవ్ర చర్చ నడిచింది. వైసీపీ, జనసేన నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. వాహనానికి వేసిన రంగు చట్ట విరుద్దమని చెల్లదని ఆర్టీఏ అనుమతి ఇవ్వదని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. పలువురు వైఎస్ఆర్‌ీపీ నేతలు అదే చెప్పారు. దీనిపై జనసేన క్లారిటీ ఇచ్చినా పదే పదే విమర్శలు చేశారు. జనసేన నేతలు తమకు చట్టాలు తెలియవా అని ప్రశ్నించారు. అంతా చట్ట ప్రకారమే చేశామన్నారు. ఈ అంశంపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ ఓ రోజంతా  వైఎస్ఆర్‌సీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఉదయమే అలీవ్ గ్రీన్ కలర్ షర్ట్‌ను పోస్ట్ చేసి.. కనీసం తాను ఈ చొక్కానైనా వేసుకోనిస్తారా అని ప్రశ్నించారు. తరవాత విశాఖలోని ఓ పచ్చన ప్రాంతాన్ని చూపించి ఇలాంటి గ్రీన్ అయితే మీకు ఇష్టమేనా అని పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ వస్తున్నారని చెప్పి..  ఆ ప్రాంతంలో ఉన్న పచ్చదనం మొత్తాన్ని కట్ చేసేశారు. విశాలమైన స్థలంగా మార్చారు. దీన్నే సెటైరిక్‌గా పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. 


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు సైటైర్లు వేశారు. వారాహి వాహనానికి చంద్రన్న పంది అనే పేరు పెట్టుకుంటే బాగుంటుందని సెటైర్లు వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహి కాదు అది‌ నారాహి అని ఏపీ మంత్రి ఆర్.కే.రోజా విమర్శించారు. 


ఈ విమర్శలు ఇలా కొనసాగుతుండగానే పవన్ కల్యాణ్ ప్రచార రథం వారాహి రథం రిజిస్ట్రేషన్ తెలంగాణలో పూర్తైంది. వారాహి వాహనం రంగు విషయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వ్యవహరించలేదని, అన్ని రూల్స్‌కు అనుగుణంగా ఉండటంతో వాహనానికి రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు తెలిపారు. వాహన రిజిస్ట్రేషన్‌లో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని తెలంగాణ ఆర్టీవో అధికారులు స్పష్టం చేశారు. వారాహి రంగు ఆలివ్ గ్రీన్ కాదని, ఎమరాల్డ్ గ్రీన్ అని గుర్తించడంతో రిజిస్ట్రేషన్ చేశామని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం వాహనం తమ వద్దకు వచ్చినప్పుడు అన్ని నిబంధనలు పక్కాగా పరిశీలించామని.. నిబంధనల ప్రకారం వాహనం రంగు ఉండటంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అంగీకరించారు. TS 13 EX 8384 నెంబరుతో రిజిస్ట్రేషన్ పూర్తి అయిందని.. ట్రాన్స్‌పోర్ట్  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ తెలంగాణ పాపారావు మీడియాకు తెలిపారు.