MLA Jogu Ramanna: ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు 44వ నెంబర్ జాతీయ రహదారిపై గల పెన్ గంగానది తో పాటు జైనథ్ మండలంలోని చనకా కొరటా బ్యారేజిని ఎమ్మెల్యే జోగు రామన్న సందర్శించారు. పెన్ గంగానదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో గంట గంటకు నీటి ప్రవాహ ఉద్ధృతి పెరుగుతూ వస్తోంది. అయితే గురువారం ఎమ్మెల్యే జోగు రామన్న స్వయంగా పెన్ గంగానది ఉద్ధృతిని పరిశీలించారు. వద్ద వరద ఉద్ధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. 


బ్యారేజీ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకవేళ బ్యారేజీ నిండితే.. గేట్లు తెరవాల్సి వచ్చినప్పుడు ముందుస్తుగానే ముంపు ప్రాంతాలన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అనంతరం పంప్ హౌస్ వద్ద పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎప్పిటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా ప్రజలను కాపాడాలని అధికారులను ఆదేశించారు. 
ఎమ్మెల్యే వెంట డీసీసీబీ ఛైర్మన్ బోజా రెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు ఉన్నారు. 


ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి, ప్రాణ నష్టం ఉండకూడదు..


తన నియోజక వర్గంలో ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకూడదని  జిల్లా అధికారులను హెచ్చరించారు. పురాతన ఇళ్లల్లో ఉన్న వారంతా ప్రత్యేక శిబిరాలకు వచ్చి వసతి పొందాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, చెరువులు, వాగుల వద్దకు వెళ్లొద్దని.. ఫొటోల కోసం జలాశయాలకు వెళ్లి కోరి ప్రమాదాలు తెచ్చుకోవద్దని హితవు పలికారు. పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం అంటే ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వం కచ్చితంగా సాయం చేస్తుందని వివరించారు. మరో రెండు మూడు రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. అలాగే అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించాలని.. క్షేత్ర స్థాయిలో తిరుగుతూ ప్రజలకు సాయం చేయాలని వివరించారు. 


ఎలాంటి భయమూ అవసరం లేదు.. మేమంతా ఉన్నాం..


అలాగే సీఎం కేసీఆర్ గత మూడ్రోజులుగా ప్రగతి భవన్ లోనే ఉండి రాష్ట్రంలో వానలు, వరదలపై తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని.. ప్రజలు భయపడాల్సిన అవసరం అస్సలే లేదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. సీఎం కేసీఆర్ తోపాటు తామంతా కూడా ప్రజల కోసమే పని చేస్తున్నామని.. మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే డీసీసీబీ ఛైర్మన్ బోజా రెడ్డి మాట్లాడుతూ... భారీ వర్షాల వల్ల జిల్లాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని నిలువరించేందుకు ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేసి, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అన్నారు. అయితే చెరువులన్నీ పూర్తి స్థాయిలో నిండి అలుగులు పారుతున్నందున, అనేక చోట్ల రోడ్లపై నుండి పెద్ద మొత్తంలో వరద జలాలు ప్రవహిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా వరద ప్రవాహంతో ఉన్న రోడ్లపై రాకపోకలు సాగించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.