Rekurthi Village in Karimnagar: తెలంగాణ ఉద్యమ సాధన కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ నేడు తెలంగాణ అమరవీరుల త్యాగాలను, ఉద్యమ ఆకాంక్షలను విస్మరించి స్వార్థ రాజకీయాల కోసమే  బిఆర్ఎస్ గా ఆవిర్భవించిందని బీజేపీ నాయకురాలు, కేంద్ర సెన్సార్ బోర్డు మెంబర్ జీవిత రాజశేఖర్ అన్నారు. టీఆర్ఎస్ తో తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించనోళ్లు.. బీఆర్ఎస్ తో దేశాన్ని ఉద్ధరిస్తామనడం, అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అని ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ కు, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న బంధం తెగిపోయిందని, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి కౌండౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు.


బీఆర్ఎస్ హటావో.. తెలంగాణ బచావో నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయాలని జీవిత రాజశేఖర్  పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం రేకుర్తిలో శక్తి కేంద్ర ఇన్చార్జ్ జాడి బాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటుచేసిన శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ సమావేశాలకు బీజేపీ నాయకురాలు, నటి జీవిత రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, అమరవీరుల ఆశయ సాధనలను నెరవేరుస్తామని ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలంగాణ సమాజాన్ని మోసం చేసిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, బీఆర్ఎస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసేలా  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. అందులో భాగంగానే నేడు శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాలతో ప్రజల మధ్యకు వచ్చిందన్నారు. 


కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 ఏళ్ల కాలం గడిచిపోయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, ఆశయాలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మారుస్తామని కేసీఆర్ అధికారంలోకి వచ్చి 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణ మార్చారని ఆమె దుయ్యబట్టారు. ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తిని వీడి అధికారమే పరమావధిగా ఇన్నేళ్ల కాలంగా జీవిస్తుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలన చేతిలో బంధీ అయిందని, తెలంగాణ సమాజం కోరుకున్న  దానికంటే భిన్నంగా కేసీఆర్ సర్కార్ పాలన కొనసాగిస్తుందని జీవిత విమర్శించారు. 


నలుగురు వ్యక్తులు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందే వేదం శాసనం అనే విధంగా మారిందని, సామాన్యులు జీవించలేని దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాస్వామ్యంలో పార్టీలు పెట్టుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, నాడు టీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ సాధించింది ఏమిటి? నేడు బిఆర్ఎస్ తో సాధించేది ఏమిటో ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన కేసీఆర్ ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం అనేక సమస్యల తో సతమతమవుతుంటే పరిష్కరించాల్సిన కేసీఆర్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటుందని  విమర్శించారు.


జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ఏ రంగం కూడా సక్రమంగా అభివృద్ధి చెందింది లేదని, సామాన్య ప్రజానీకం జీవంచలేని దయనీయపరిస్థితి కేసీఆర్ పాలనలోనే ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నాడు టీఆర్ఎస్ మాయ మాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని నమ్మించి మోసం చేశారని, నేడు బీఆర్ఎస్ తో మళ్లీ ప్రజానీకాన్ని మోసం చేయడానికి కొత్త రాజకీయ నాటకం మొదలు పెట్టారని కృష్ణారెడ్డి విమర్శించారు. 


కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను బిజెపి శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లాలని, దేశంలోని మోడీ ప్రభుత్వ పాలను, పథకాలను, విజయాలను ప్రజలకు వివరించాలనీ, ప్రజలకు వాస్తవ విషయాలు  తెలియజేయడానికి, పై విషయాలతోఇంటింటికి బిజెపి చేరువ కావాలనే ఉద్దేశంతో శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు, తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసే వరకు బిజెపి శక్తి కేంద్ర ఇంఛార్జులు, బూత్ కమిటీ బాధ్యులు, పార్టీ శ్రేణులు విశ్రమించవద్దన్నారు.