జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఆపరేషన్ చేసి మహిళ కడపులో ఓ పెద్ద గుడ్డ ముక్కను డాక్టర్లు వదిలేశారు. సరిగ్గా 16 నెలల క్రితం ఇది జరిగింది. తర్వాత మహిళను డిశ్చార్జి చేయడంతో ఆమె ఎప్పటిలాగే రోజువారీ పనులు చేసుకుంటోంది. ఇటీవల కడుపునొప్పి తీవ్రంగా రావడంతో ఈసారి ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు ఆమెకు స్కానింగ్ చేయగా, కడుపులో గుడ్డ పీలిక ఉన్నట్లుగా గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి గుడ్డ ముక్కను తొలగించారు.


గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య శ్రీ అనే మహిళకు డెలివరీ అయింది. డెలివరీ సమయంలో సర్జరీ చేసిన వైద్యులు ఆమె కడుపులోనే బట్టను మర్చిపోయారు. అలాగే కుట్లు వేసేశారు. సంవత్సరం తర్వాత నవ్యశ్రీ కి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్టని తొలగించారు. ఆ గుడ్డ ముక్క చాలా పెద్ద సైజులో ఉంది. క్లాత్‌ను బయటకు తీస్తుండగా దీనిని వీడియో తీశారు. ప్రస్తుతం మహిళ పరిస్థితి ఆరోగ్యకరంగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు.


ఆపరేషన్ చేసే సమయంలో కడుపులోపల కత్తి, కత్తెర లాంటి పరికరాలు మర్చిపోవడం, వాచ్ లోపల ఉంచేసి కుట్లు వేసిన ఘటనలు గతంలో ఎన్నో వెలుగు చూశాయి. ఇప్పుడు మరోసారి వైద్యుల నిర్లక్ష్యం బయటపటపడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని వైద్య అధికారులు చెబుతున్నారు.


కడుపులో క్లాత్ ఘటనపై జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా స్పందించారు. ఈ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జరీ చేసిన డాక్టర్, అసిస్టెంట్స్ వివరాలు కావాలని ఆదేశించారు.