ED Raids On Gangula :  తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ దుబాయ్ పర్యటనలో ఉన్నారు. కుటుంబంతో కలిసి వ్యక్తిగత పర్యటన కోసం ఆయన దుబాయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే అనూహ్యంగా ఆయన ఇంటిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు దాడి చేశారు. కరీంనగర్‌లోని ఆయన  ఇంటికి తాళం వేసి ఉంది. ఎవరూ లేకపోవడంతో.. సోదాల కోసం వచ్చిన ఈడీ అధికారులు మంత్రిని సంప్రదించే ప్రయత్నం చేశారు. తాళాలు ఎవరి దగ్గర ఉన్నాయో ఆరా తీశారు. అయితే మంత్రి కానీ ఆయన తరపు బంధువులు కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో ఈడీ అధికారుల తాళాలు పగులగొట్టి మరీ ఇంట్లోకి ప్రవేశించి సోదాలు నిర్వహించారు. 


కరీంనగర్ గ్రానైట్ వ్యాపారుల అక్రమాలపై ఈడీకి పలు ఫిర్యాదులు


కరీంనగర్‌లో గ్రానైట్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఈడీ ఎనిమిది సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబసభ్యులు..వారికి అత్యంత సన్నిహితులవేనని చెబుతున్నారు. ఈడీ నోటీసులు వచ్చిన చాలా కాలానికి సోదాలు చేస్తున్నారు. మొత్తంగా హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో 30 బృందాలు సోదాల్లో పాల్గొంటున్నాయి.  కరీంనగర్ మైనింగ్ కేసులో 170 కోట్లు అవినీతి జరిగిందని.. అక్రమ మైనింగ్ చేస్తూ వేల కోట్లు రూపాయలు ప్రభుత్వానికి గండి కొడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  రైల్వే, షిప్స్ లలో విదేశాలకు మైనింగ్ అక్రమ రవాణా చేస్తూ కోట్లు రూపాయలు సంపాదించారుని ఈడీకి ఫిర్యాదులు అందాయి. 


బండి సంజయ్‌తో పాటు ఆధారాలతో సహా మరో లాయర్ ఫిర్యాదు 


తన ఫిర్యాదుపైనే సోదాలు జరుగుతున్నాయని ఓ లాయర్ ప్రకటించారు.  గ్రానైట్ బిజినెస్‌లో ఉన్న గంగుల కమలాకర్ మంత్రి గా, గాయత్రి గ్రనేట్ రవి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారని..  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల పై శ్రద్ధ ఉంటే మైనింగ్ ఆక్రమాలకు పాల్పడిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని ఆయన  కోరుతున్నారు. గ్రానైట్ వ్యాపారుల అక్రమాలపై రెండేళ్ల కిందటే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ..కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ తర్వాత పట్టించుకోలేదు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారడం.. వెంటనే దాడులు జరగడం కలకలం రేపుతోంది. 


మంత్రి దేశంలో లేకపోయినా ఇంటి తాళాలు పగులగొట్టి మరీ సోదాలు చేయడంపై రాజకీయవర్గాల్లో కలకలం


మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఎవరూ లేకపోయినా సోదాలు చేయడానికి ఈడీ అధికారులు ఏ మాత్రం వెనుకాడలేదు. మంత్రి లేకుండా తాళాలు తీసేందుకు కుటుంబసభ్యులు కూడా అంగీకరించలేదు. అయితే ఈడీ కాబట్టి తాళాలు పగులకొట్టి సోదాలు చేసే  హక్కు ఉంది. ఆ మేరకు కేంద్ర బలగాల భద్రతలో.. ఈ సోదాలు నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఏం దొరికాయన్నదానిపై ఈడీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మామూలుగా ఇలాంటి సోదాల విషయంలో ఈడీ ఎలాంటి ప్రకటనా చేయదు. ఇప్పుడు కూడా ఎలాంటి వివరాలూ ప్రకటించారు.