Indian National Anthem: దాదాపు ఐదేళ్ల కింద ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట పట్టణంలో ప్రారంభమైంది నిత్య జాతీయ గీతాలాపన. ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటలకు పట్టణంలో క్రమం తప్పకుండా జాతీయ గీతాన్ని మైకుల ద్వారా వినిపించే వారు. దీంతో వివిధ పనులపై బయటకు వచ్చినా ప్రజలు ఎక్కడికి అక్కడ నిలబడి తాము కూడా గొంతు కలిపే వారు. ఇలా మొట్ట మొదటి సారిగా బహిరంగ ప్రదేశంలో నిత్య జాతీయ గీతాలాపన మొదలు పెట్టిన పట్టణంగా జమ్మికుంట పేరు గాంచింది. అయితే కేవలం మొదలు పెట్టడమే కాదు.. అప్పటి నుండి ప్రతి రోజు జాతీయ గీతాలాపన వినిపిస్తూనే ఉన్నారు.


అలా మొదలైంది... 
2017 లో ఆగస్టు 15వ తేదీన జమ్మికుంట పట్టణంలో ప్రశాంత్ రెడ్డి నిత్య జనగణమనకు శ్రీకారం చుట్టారు. దీంతో ఈ విషయం వార్తల ద్వారా నాయకులను ప్రజలను ఆకర్షించడంతో ఇదే కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోని వివిధ ప్రాంతాల్లో ఇదే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. యాభై రెండు సెకండ్ల పాటు వచ్చే పాటతో దేశభక్తిని చాటుకునేలా.. అప్పట్లో మొదలు పెట్టిన ఈ కార్యక్రమం పలువురి ప్రశంసలు పొందింది. ప్రశాంత్ రెడ్డి హైదరాబాదులోని శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు.


ప్రజలు స్వచ్ఛందంగా జాతీయ భావాన్ని పెంపొందించుకునేలా మొదలు పెట్టిన ఈ కార్యక్రమం తరువాత ఇతర రాష్ట్రాలు హరియాణా, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు సైతం విస్తరించింది. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే కరీంనగర్ కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద, జగిత్యాల టవర్ సర్కిల్, రామడుగు మండలం గోపాల్ రావు పేట, జగిత్యాల జిల్లా కోరుట్ల, కొడిమ్యాల మండలం నల్లగొండ, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్న చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీసులోనూ, సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు లో ఇలాంటి కార్యక్రమం ప్రారంభమైంది. అక్కడి ప్రజల్లో దేశభక్తిని నిరంతరం నింపుతోంది.


నిరంతర దేశభక్తి..


తాను సీఐగా ఉన్న సమయంలో ప్రజల్లో ఉన్న దేశభక్తిని నిరంతరం కొనసాగించాలనే తపనతో ఈ ఆలోచన చేశానని ప్రస్తుతం హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్న అప్పటి జమ్మికుంట సీఐ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజలు జాతీయ గీతం మొదలవగానే సెల్యూట్ చేస్తూ పాడుతుండటంతో.. క్రమ క్రమంగా ఈ కార్యక్రమాన్ని పలు ప్రాంతాలకు విస్తరించారు. తన ఆలోచన సక్సెస్ కావడం పట్ల అమితమైన ఆనందం కలిగిందని సీఐ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సామూహికంగా చేసే ఈ గీతాలాపన ద్వారా సోదర భావం సమన్వయం పెరిగి శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ఆయన అన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు దీనికి స్పందించి, అభినందించారని అయితే ప్రజలు చూపించే అభిమానం తన బాధ్యతలు మరింత పెంచిందని ఆయన వివరించారు. బిందువు బిందువు కలిస్తే సింధువు అవుతుంది అన్నట్లుగా ఒక ప్రాంతంలో ఉద్యమంలా మొదలైన సామూహిక జాతీయ గీతాలాపన ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించడం నిజంగా జిల్లాకు గర్వ కారణం అని స్పష్టం చేశారు.