Central Government Schemes: భారత ప్రధాని కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు విడుదలుగా రైతులకు అందిస్తోంది. అయితే పథకం పై సరైన సమాచారం అవగాహన లేక చాలా మంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. అయితే కొద్ది రోజులుగా క్లస్టర్ల వారీగా రైతు వేదికల ద్వారా వ్యవసాయ విస్తరణ అధికారులతో అవగాహన కల్పిస్తున్నారు. ఆధార్ కు ఫోన్ నంబర్ ను లింక్ చేయకపోవడం, ఒకటి కంటే ఎక్కువ ఫోన్ నెంబర్లను లింక్ చేయడం బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ లేకపోవడంతో పాటు వివిధ సాంకేతిక కారణాలతో రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందడం లేదు. పథకానికి సంబంధించి ఈ -కేవైసీ చేసుకోకపోవడమే అని సమస్యలకు కారణం అని అధికారులు చెబుతున్నారు. ఈనెల  20 లోగా అధికారుల ద్వారా గాని, కామన్ సర్వీస్ సెంటర్లు మీసేవ కేంద్రాల్లో గాని అన్ని వివరాలను నమోదు చేస్తేనే సాయం అందుతుందని లేదంటే ఈ ప్రయోజనానికి దూరం కావాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. 


20 వేల మంది రైతుల ఆధార్ విలువలను తిరస్కరించిన వెబ్ సైట్


ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 3,81,541 మంది రైతులు ఉండగా ఇప్పటి వరకు 3,27,786 మంది ఈ- కేవైసీ వివరాలు అందించారు. మిగిలిన 53,755 మంది నుంచి వివరాలు సేకరించే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేల మంది రైతుల ఆధార్ వివరాలను వెబ్ సైట్ తిరస్కరించింది. కిసాన్ సమ్మాన్ సాయం పంపిణీకి నిబంధనలను కటిన తరం చేశారు. ఏ ఒక్క సమాచారం ఇవ్వకుండా సాయాన్ని నిలిపి వేస్తున్నారు. పది వేలకు పైగా పింఛను వచ్చేవారు ప్రభుత్వ ఉద్యోగులు కిసాన్ సమాన్ నిధి పథకానికి అర్హులు కారు. కుటుంబంలో భార్యా భర్తలిద్దరికీ వేరు వేరు రెవెన్యూ గ్రామాల్లో భూమి ఉన్న ఒక్కరికే పథకం వర్తిస్తుంది. ప్రజా ప్రతినిధులు ఆదాయ పన్ను చెల్లింపుదారులు విదేశాల్లో నివాసం ఉంటున్న రైతులకు ఈ పథకం వర్తించదు. 2019 ఫిబ్రవరి 1వ తేదీలోగా పట్టాదారు పాస్ బుక్కులను కలిగిన రైతులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే వారు బ్యాంకు ఖాతాలను ఆధార్ తో లింక్ చేయాలి. 


పెండింగ్ లోనూ చాలానే ఉన్న దరఖాస్తులు..


మీ సేవ కేంద్రాల్లో ఈ- కేవైసీ చేసిన తర్వాత వివరాలను సంబంధిత బ్యాంకు లోను అందించాలి. ఉమ్మడి జిల్లాల్లోని వివరాలలో జగిత్యాల జిల్లాలో 1,33,240 మంది రైతులు ఉన్నారు. ఈ -కేవైసీ సమర్పించిన వారు కేవలం లక్ష 1,10,669 మంది మాత్రమే. ఇంకా 22,571 పెండింగ్ లో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో 76,035 మంది రైతులు ఉండగా,ఈ -కేవైసీ సమర్పించిన వారు కేవలం 72,000 మాత్రమే ఇంకా 4,035 మంది పెండింగ్ లో ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో 99,443 మంది రైతులకు గాను ఈ-కేవైసీ సమర్పించిన వారు కేవలం 85,100 మాత్రమే 14,343 మంది పెండింగ్ లో ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72,823 మంది రైతులకు గాను ఈ-కేవైసీ సమర్పించిన వారు 60,000 మంది మాత్రమే ఇంకా 12,806 పెండింగ్ లో ఉన్నాయి.