Marri Shashidar Reddy :కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం చేసే సమయం ఆసన్నమైందని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. కుటుంబ పాలనలో బందీ అయిన  తెలంగాణ తల్లి విముక్తి కోసం బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నారన్నారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర  ఈనెల 15వ తేదీన కరీంనగర్ కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా  కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో 15వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని తెలిపారు. కరీంనగర్ లో జరగబోయే సభలో  సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొని సభను విజయవంతం చేయాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. ఈనెల 15న కరీంనగర్ లో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా రావాలన్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, బీజేపీ శ్రేణులతో కలిసి సభకు హాజరు కావాలని వ్యాపార వాణిజ్య వర్గాలకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. 


వచ్చే ఎన్నికల్లో తెలంగాణ తల్లికి విముక్తి 


మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... నిరంకుశ, అవినీతి కుటుంబ పాలనపై బండి సంజయ్ కుమార్ సమరశంఖం పూరించారన్నారు. టీఆర్ఎస్ కుటుంబ కబంధ హస్తాల్లో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం పోరాడుతున్నారన్నారు.  ప్రజాస్వామిక తెలంగాణ  సాధన కోసం  అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంగ్రామ యాత్రతో  ప్రజల మధ్యకు పాదయాత్రతో వస్తున్నందున జిల్లా పరిధిలో ప్రజలు యాత్రకు బ్రహ్మరథం పట్టాలని పిలుపునిచ్చారు. అమలుకు నోచుకోలేని హామీలతో  తెలంగాణ ప్రజలు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అందుకే బండి సంజయ్ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి, ప్రజలను జాగృతం చేయడానికి  ప్రజాసంగ్రామ యాత్ర చేపడుతున్నారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలు స్వచ్ఛందంగా యాత్రలో భాగస్వామం అయ్యే విధంగా 15న జరిగే  కరీంనగర్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చే విధంగా  కృషి చేయాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యాయ రాజకీయ శక్తిగా అవతరించిందని, ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని  బలంగా విశ్వసిస్తున్నారని స్పష్టం చేశారు. కరీంనగర్ లో జరగబోయే సభతో బీజేపీ సత్తా చూపించడానికి, విజయవంతం చేయడానికి శ్రేణులు అందరూ సమిష్టి కృషి చేయాలని మర్రి శశిధర్ రెడ్డి కోరారు. బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక నేతలతో కలిసి ఆయన పర్యవేక్షిస్తున్నారు.