బండి సంజయ్‌ పై కోడిగుడ్లతో దాడి జరిగింది. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలంలో ప్రజాహిత యాత్ర నిర్వహిస్తున్నారు. వంగరలో యాత్ర చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బండి సంజయ్ కాన్వాయ్ మీద గుడ్లు విసిరారు. ఈ దాడితో అసహనం చెంది బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసు బందోబస్తు ఏం వద్దని.. మీరు వెళ్లిపోండి.. అంటూ పోలీసులపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. 






వంగరలో దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఇంటిని బండి సంజయ్ సందర్శించారు. ఆ తర్వాత ముల్కనూర్‌ బయల్దేరుతుండగా ఇద్దరు వ్యక్తులు కోడిగుడ్లు విసిరినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాన్వాయ్‌లోని మీడియా వాహనంపై పడ్డాయి. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ కార్యకర్తలే ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని అన్నారు. బండి సంజయ్‌ మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో కోడిగుడ్లతో దాడి జరిగినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసుల భద్రత అవసరం లేదని.. పోలీసులు తనతో రావొద్దని సూచించారు. తన రక్షణ తమ కార్యకర్తలే చూసుకుంటారని బండి సంజయ్ అన్నారు.