Karimnagar News : కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ లో సమ్మె సైరన్ మోగింది. బస్సుల డ్రైవర్ల సమ్మెతో శనివారం తెల్లవారుజాము నుంచి పల్లె వెలుగుతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే అద్దె బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి కరీంనగర్ కు వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. విద్యార్థులు కూడా సకాలంలో స్కూళ్లు, కాలేజీలకు చేరుకునే పరిస్థితి కనిపించడం లేదు. నామమాత్రం వేతనాలతో పాటు వేధింపులు కూడా తీవ్రమయాయమని బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే వేతనాలు పెంచడంతోపాటు ఆర్టీసీ అధికారులు తమపై చూపుతున్న వివక్ష విడాలని, వేధింపులు నిలువరించాలని డ్రైవర్ల డిమాండ్ చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున కరీంనగర్ ఆర్టీసీ డిపో ముందు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేస్తూ బస్ డ్రైవర్లు చేస్తున్న నిరసనతో బస్సు స్టేషన్ ప్రాంతమంతా ఒక్కసారిగా హోరెక్కింది. బస్సులు డ్రైవర్ల నిరసనకు సీఐటీయూ కూడా మద్దతు తెలపడంతో ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. దాదాపు నెలరోజుల క్రితం  ఇదే విధంగా సమ్మెకు దిగడంతో అధికారులు అద్దె బస్సుల యాజమాన్యంతో చర్చలు జరపడంతో అప్పుడు ఆందోళనలు నిలిచాయి. ఇవాళ మళ్లీ అవే డిమాండ్లతో అద్దె బస్సుల డ్రైవర్లు నిరసనకు దిగారు. సమ్మెతో  అద్దె బస్సులు, ప్రైవేటు బస్సుల ఎక్కడకక్కడే నిలిచిపోగా గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున ఆర్టీసీ డిపోల మందు మోహరించారు.