కరీంనగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయం గేట్లు పగలగొట్టి పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాలను బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించారు. అనంతరం కట్టర్ తో తలుపులు కత్తిరించి లోపలికి వెళ్లిన పోలీసులు... బండి సంజయ్ ను అరెస్టు చేశారు. పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తలకు గాయమై రక్తం కారుతున్నా పట్టించుకోకుండా బండి సంజయ్ ను వ్యాన్ లో ఎక్కించిన అక్కడి నుంచి తరలించారు పోలీసులు.
అసలేం జరిగింది
కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ జన జాగరణ దీక్షను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీక్షకు అనుమతి లేదని కరీంనగర్ లోని జాగరణ సభావేదిక వద్దకు వచ్చిన జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతోపాటు ఎంపీ కార్యాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం జారీచేసిన 317 జీవోను సవరించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ ఇవాళ జన జాగరణ దీక్ష చేసేందుకు సిద్ధమయ్యారు. రేపు ఉదయం 5 గంటల వరకు ఆయన జాగరణ దీక్ష చేసి నిరసన చేయాలని నిర్ణయించారు. దీక్షకు సిద్ధమయ్యే సమయంలో అనుమతి లేదని కరీంనగర్ పోలీసులు అడ్డుకున్నారు.
బండిపై బండి సంజయ్ తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ కార్యకర్తలు వలయంలా ఏర్పడి బండి సంజయ్ ను క్యాంపు కార్యాలయంలోపలికి తీసుకెళ్లారు. క్యాంపు కార్యాలయంలో ఆయన జాగరణ దీక్ష ప్రారంభించారు. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు.
Also Read: నేను కోవర్ట్ అయితే.. రేవంత్ కూడా కోవర్టే.. టీఆర్ఎస్ లోకి వెళ్లాలనుకుంటే ఎవరూ ఆపలేరు
