Mlc Kavitha : గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.  జగిత్యాల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీ పర్యటనపై మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్త మాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు తప్పా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు ఏం చేశారని ప్రధానిని ముఖ్యమంత్రి ప్రశ్నించారని, కానీ వాటికి మోదీ ఎక్కడా కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోతున్నారని విమర్శించారు. ఉత్తి మాటలు చెప్పేవాళ్లేవరూ అభివృద్ధి చేసే నాయకులేవరు అన్నది ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.  


టీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం 


శనివారం జగిత్యాల జిల్లా రాయికల్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..గత ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను 60 వేల మెజారిటీతో జగిత్యాల ప్రజలు గెలిపించారని, వచ్చే ఎన్నికల్లో ఆ రికార్డును బద్ధలు కొట్టి మళ్లీ జగిత్యాల జైత్రయాత్రను మొదలుపెట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని, ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో  ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుందన్నారు. ఎన్ని ఇతర పార్టీలు ఉన్నా, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వంటి వారు ఉన్నా కూడా ఎన్నడూ ఒక చిన్న గ్రామాన్ని పట్టించుకోలేదని,  గ్రామ సమస్యలను అడగలేదని చెప్పారు. రాయికల్ గతంలో వసతులు లేకుండా ఒక చిన్న గ్రామంగా ఉండేదని, కానీ ఆ నాడు మంత్రి జీవన్ రెడ్డి రాయికల్ ను మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలనుకోలేదని గుర్తు చేశారు. రాయికల్ పట్టణం ఒకప్పుడు వలసల మండలంగా ఉండేదని, ఇప్పుడు పంటల మండలంగా మారిందని స్పష్టం చేశారు. 


దేశంలో బీఆర్ఎస్ విప్లవం 


ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. 'అయ్యా జీవన్ రెడ్డి గారూ ఝూటో నో జోడో నో పాదయాత్ర చేసుకుంటూ ఇటీవలే రాహుల్ గాంధీ తెలంగాణలోకి వచ్చారు.  ఆ సమయంలో మునుగోడులలో ఎన్నికలు జరుగుతున్నాయి. మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం చాటేశారు. మా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఎప్పడూ ముఖం చాటేయలేదు. ముఖం చాటేసే నాయకులు కాంగ్రెస్, బీజేపీ నాయకులే కానీ గలాబీ కండువా కప్పుకున్న వాళ్లు ఎప్పడూ ముఖం చాటేయరు.’’ అని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు.  రాజకీయాల్లో ఒడిదిడుకులు ఉంటాయని, అయినా కూడా అనుకున్న లక్ష్యం సాధించే వరకు వెంటపడేవారే నాయకులవుతారని, వారే చివరి మజిలీ వరకు చేరుకుంటారని స్పష్టం చేశారు.  తెలంగాణను టీఆర్ఎస్ ఎలా అయితే బంగారుమయం చేసిందో.. రేపు భారత దేశంలో కూడా బీఆర్ఎస్ అదే విప్లవం సాధిస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. 


గెలిచిన తర్వాత హామీలు మరిచిపోయారు


బోర్నపల్లి బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చి జీవన్ రెడ్డి రెండు సార్లు ఎన్నికల్లో గెలిచారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. గెలిచిన తర్వాత హామీని మరిచిపోయారన్నారు.    ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బొడమల్లన్న  అనేదే జీవన్ రెడ్డి విధానం అని కవిత విమర్శించారు. అదే తాము అలా చేయలేదని, బోర్నపల్లి బ్రిడ్జి కట్టిస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా రూ. 85  కోట్లతో బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు. ప్రతీ రోజు కేసీఆర్ ను ఏదో ఒకటి అంటూ జీవన్ రెడ్డి వార్తల్లో నిలిచే ప్రయత్నచేస్తారని విమర్శించారు. ఎన్నిసార్లు రోళ్ల వాగు పేరు మీదు గెలిచారు జీవన్ రెడ్డి అని ప్రశ్నించారు. గెలిచాకా దాన్ని చేపట్టే ప్రయత్నం చేయలేదని తెలిపారు. అదే తాము రూ.135 కోట్లతో రోళ్లవాగును నిర్మిస్తున్నామని, జగిత్యాలను జిల్లా చేయడమే కాకుండా మెడికల్ కాలేజీని మంజూరు చేశామని, రాయికల్ ను మున్సిపాలిటీ చేశామని, రూ. 25 కోట్ల నిధులు మంజూరయ్యాయని వివరించారు.