Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు దూరం కాబోతున్నారా అంటే అవునన్న సమాధానం వినిపిస్తుంది. కాకపోతే అది శాశ్వతం కాదు తాత్కాలికమే. శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంత్రి బండి సంజయ్ సోమవారం ఉదయం కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవారి ఆలయంలో ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆయనతోపాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు భవానీ దీక్ష చేపట్టారు. నేటి నుండి విజయదశమి వరకు బండి సంజయ్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. సామాన్య భక్తుడి వలే మహాశక్తి అమ్మవారి సన్నిధిలోనే ఎక్కువ సమయం గడపుతూ అమ్మవారిని సేవిస్తారు.


ఇది 14వ సారి
బండి సంజయ్ భవానీ దీక్ష చేపట్టడం ఇది 14వసారి. మహాశక్తి అమ్మవార్ల ఆలయ ప్రతిష్టాత్మక మహోత్సవం సందర్భంగా 2011లో తొలిసారిగా బండి సంజయ్ ‘భవానీ దీక్ష’ చేపట్టారు. ఆనాడు ఆయనతోపాటు మరో ఐదారుగురు మాత్రమే దీక్ష చేపట్టారు. అధ్యాత్మకంగా హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలని, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ భవానీ దీక్ష చేపట్టాలనే ఉద్దేశంతో బండి సంజయ్  ప్రోత్సహిస్తున్నారు.  ఖర్చుతో పనిలేకుండా, భవానీ దీక్ష చేపట్టాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కరీంనగర్ లోని మహాశక్తి అమ్మవార్ల ఆలయంలోనే అన్ని ఏర్పాట్లు చేశారు. భవానీ దీక్ష చేపట్టే భక్తులందరికీ దేవాలయంలో చేపట్టే అన్ని రకాల పూజలు, సేవలు ఉచితంగా అందుబాటులో ఉంచారు. భగవంతుడికి భక్తులందరూ సమానమేనని చాటి చెప్పేందుకు ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. 


ఏటా వేలాది మంది భక్తుల దీక్ష
మంత్రి బండి సంజయ్ ప్రోత్సహం వల్ల నేడు కరీంనగర్ లో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏటా వేలాది మంది భక్తులు ‘భవానీ దీక్ష’ చేపడుతున్నారు. ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా, కేంద్ర మంత్రిగా బండి సంజయ్ అంచెలంచెలుగా ఎదుగుతున్నప్పటికీ భవానీ దీక్షను మాత్రం క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నారు. బండి సంజయ్ నిత్యం బిజీగా ఉన్నప్పటికీ ఈ 11 రోజులు మాత్రం భవానీ దీక్ష చేస్తున్న భక్తులతో మమేకమై ఆలయంలోనే అమ్మవారిని సేవిస్తూ నిత్య పూజలు చేయనున్నారు. నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు భవానీ దీక్ష చేపడుతున్న వేలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దేవాలయ ఆవరణలో అన్నదానం ఏర్పాటు చేశారు. బండి సంజయ్ సైతం వారితో కలిసి భోజనం చేస్తారు.


కనుల పండువగా వేడుకలు
మరోవైపు ముగ్గురు అమ్మలు కొలువైన శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలు కనుల పండువగా జరగనున్నాయి. అక్టోబర్ 3న శ్రీశ్రీశ్రీ  జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతీ స్వాముల ఆశీస్సులతో  నుండి  శ్రీ దేవీ నవరాత్రోత్సవాలు ప్రారంభమై విజయ దశమి వరకు  కొనసాగుతాయి. భక్తులకు కనువిందు చేసేలా దేవాలయ ప్రాంగణాన్ని వివిధ రకాల పూల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేస్తున్నారు.  నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయం ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగుతుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా, ఇతర రాష్ట్రాల నుండి  శ్రీ మహాశక్తి దేవాలయానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. 
Also Read: KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్


తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు 
శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవార్లను రోజుకో అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. అక్టోబర్ 3న శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి (శైలపుత్రి)గా, 4న శ్రీ గాయత్రీ దేవి (బ్రహ్మచారిని)గా, 5న శ్రీ అన్నపూర్ణ (చంద్ర ఘంట) దేవిగా, 6న శ్రీ లలితా దేవి దేవి (కూష్మాండ )గా, 7న మహాచండీ దేవి (స్కంద మాత)గా, 8న శ్రీ మహాలక్ష్మి దేవి (కాత్యాయని)గా, 9న శ్రీ సరస్వతి దేవి (కాళరాత్రి)గా,10న దుర్గాష్టమి శ్రీ దుర్గాదేవి (మహాగౌరీ)గా, 11న శ్రీ మహిషాసురమర్ధిని దేవి (సిద్ధి రాత్రి)గా, విజయ దశమి పర్వదినమైన 12వ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు.


Also Read : డిక్లరేషన్ ఇస్తే తప్పేంటి? జగన్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు