Telangana MLC Elections Result | రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది.  తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో అధికార పార్టీని తోసిరాజని రెండింటిని బీజేపి తన్నుకుపోయింది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన కాంగ్రెస్  ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడిందనే చెప్పాలి.  ఉత్తర తెలంగాణలో బీజేపీ తన పట్టును నిలుపుకున్న వైనానికి  ఈ ఫలితాలు సాక్ష్యంగా ఉన్నాయి.  


ఉమ్మడి కరీంగనర్ - నిజామాబాద్-  ఆదిలాబాద్- మెదక్ జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి  అంజి రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి  నరేందర్ రెడ్డిపై 5,106 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.  హోరా హోరీ  ఇద్దరి మధ్య విజయం దోబూచులాడినా, రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపుతో బీజేపి ముందుకు పోగా, కాంగ్రెస్ పార్టీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.  ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా బీజేపీ బలపర్చిన  కొమరయ్య గెలుపొందారు.  ఇలా ఉత్తర తెలంగాణలో కీలకమైన రెండు స్థానాలను బీజేపీ గెల్చుకోవడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాలి. 


 ఎమ్మెల్సీ గెలుపు ఎందుకు అంత ప్రాధాన్యత  అంటే..?


 ఈ ఎన్నికల్లో  రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  ఇక బీఆర్ఎస్ ఈ ఎన్నికల బరి నుండి తప్పుకుంది. దీంతో రెండు జాతీయ పార్టీలు గెలుపు కోసం తీవ్రంగా పని చేశాయి.  కరీంనగర్ - నిజామాబాద్- ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ  నియోజకవర్గంలో 15 జిల్లాలు,  42 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే అక్కడి పట్టభద్రుల తీర్పుగా ఈ ఎన్నికల ఫలితాన్ని చూడాల్సి ఉంది.  అంతే కాకుండా ఇది నేరుగా రెండు జాతీయ పార్టీల మధ్య పోటీ. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్- బీజేపీలు పోటీ పడుతున్నాయి. తమకు బలం లేని చోట మిత్రపక్షాల కూటములతో పోటీ పడుతున్నాయి. అయితే  ఇక్కడి ఎన్నికల్లో రెండు పార్టీలు నేరుగా పోటీ పడటంతో  అటు కాంగ్రెస్ సర్కార్ , ఇటు బీజేపీ రెండు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకున్నాయి. బీజేపీ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ , బీజేపీ ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా  ఈ ఎన్నికలను తీసుకుని పని చేశారు. అటు సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, అధికార పార్టీఎమ్మెల్యేలు అదే రీతిలో ప్రచారం చేశారు. 


ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో పెరిగిన జోష్...


రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెల్చుకోవడంతో బీజేపీలో జోష్ పెరిగింది. గత   అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ట్రాయంగిల్ పోటీని ఎదుర్కొన్న  కాషాయం పార్టీ  8 అసెంబ్లీ స్థానాలను, 8 ఎంపీ స్థానాలను  గెల్చుకుంది.  ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీతో జరిగిన  ఎమ్మెల్సీ పోరులో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గాను  రెండు బీజేపీ ఖాతాలో పడ్డాయి.   దీంతో రాష్ట్రంలోని చట్ట సభల్లో కాషాయ పార్టీకి  పది మంది సంఖ్యా బలం అంటే రెండు అంకెల స్కోరు కు చేరడం విశేషం.  ఓవరాల్ గా 8 మంది ఎమ్మెల్యేలు,   ఇద్దరు కేంద్ర మంత్రులు, మరో ఆరుగురు ఎంపీలు,   ఒక రాజ్య  సభ సభ్యుడు , తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీల బలం బీజేపీది.   ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపుతో  కమలం పార్టీ ఉత్తర తెలంగాణలో తన బలాన్ని సుస్థిరం చేసుకుందనే చెప్పాలి.  


వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమల నాధులు ఇప్పటి నుండే  కసరత్తు ప్రారంభించారు.  ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బరిలోకి దిగలేదు.  పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఒక్క స్థానం గెలవలేకపోయింది.  బీఆర్ఎస్ కు తమ విజయాలతో చెక్ పెట్టడం ద్వారా కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెప్పుకునే పరిస్థితి  కల్పించారు. స్థానిక సంస్థల్లోను కమలంను వికసింపజేస్తే ఆ తర్వాత టార్గెట్ తెలంగాణ అధికార పీఠమేనని పార్టీ నేతలు చెబుతున్నారు.  ఆ దిశగా ఇప్పటికే కేంద్రంలోని ముఖ్య నాయకులు, రాష్ట్ర నాయకులు  వ్యూహాలు రచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే బీజేపీ రాష్ట్ర పార్టీకి కొత్త సారధి  నియమితుడవుతాడని కమలం సీనియర్లు చెబుతున్నారు. ఈ విజయం ఇచ్చిన జోష్ తో  రానున్న రోజుల్లో బీజేపీ అధికార పీఠం దక్కించుకునే దిశగా సాగుతుందని చెప్పక తప్పదు.


ఎమ్మెల్సీ ఎన్నికల షాక్ లో కాంగ్రెస్..


 అధికార పార్టీ హోదాలో కాంగ్రెస్   ఒక్క ఎమ్మెల్సీ స్థానం గెలవకపోవడం  రేవంత్ సర్కార్ కు పెద్ద దెబ్బగా కాంగ్రెస్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగినా అనుకున్న ఫలితాలు రాలేదు. సిట్టింగ్ స్థానం కోల్పోవడమే కాకుండా  అది తమ బద్ద శత్రువైన బీజేపీ ఖాతాలో పడటం హస్తం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. 15 నెలల అధికారంలో  తాము అన్ని  హమీలు నెరవెర్చుతున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తూ వచ్చింది.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రచారం చేసినా పట్టభద్రుల నియోజకవర్గ  ఎమ్మెల్సీ స్థానాన్ని  కాంగ్రెస్ కోల్పోయింది.  బీసీ నినాదంతో కాంగ్రెస్ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసినా అది బూమ్ రాంగ్ అయింది.  


ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న  బీసీ కుల గణన పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం కూడా పార్టీకి నష్టం చేకూర్చింది.  అంతే కాకుండా ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్యాయం జరిగిందని ఇందుకు  కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేసిన కామెంట్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కొంత నష్టం చేశాయని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.  ఉత్తర తెలంగాణలోని 19 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, పీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు , కాని రిజల్ట్ భిన్నంగా రావడంతో ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో వ్యూహ, సమన్వయ లోపం జరిగిందన్న చర్చ హస్తం నేతల్లో సాగుతోంది.


Also Read: Telangana Cabinet Decisions : ఉద్యోగ ప్రకటనలు, బడ్జెట్ సమావేశాలు, - తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే! 


 ఈ ఓటమి బాధ్యతను ఎత్తుకునేది ఎవరు ?


 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరాజయం ఇప్పుడు ఎవరి ఖాతాలో పడనుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో  సాగుతోంది. ఈ  ఎఫెక్ట్ సీఎం రేవంత్ రెడ్డికా,లేకా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖాతాలోనా, లేక ఉత్తర తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు బాధ్యులా అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా ఈ ఫలితం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అధిష్టానం వద్ద పలుచన అయ్యే అవకాశం ఉంది. సిట్టింగ్ స్థానం కోల్పోవడం విషయంపై హైకమాండ్ కు  ఏం చెప్పలేని పరిస్థితి.  15 నెలల పాలన కాలంలో రేవంత్ రెడ్డి పూర్తి స్వేచ్చగా పాలన సాగించారని, హైకమాండ్  ఆ రీతిలో స్వేచ్ఛ నిచ్చిందని హస్తం నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్  పోస్ట్ ను తన సన్నిహితునికే ఇప్పించుకున్నారు.   అంతటి ప్రాధాన్యతను హై కమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి  ఇచ్చిందని, కాని  అధికారంలో ఉండగా ఈ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేక ఫలితం రావడం మాత్రం జీర్ణించుకోలేని విషయంగా పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.  ఈ బాధ్యత అధికార పీఠం మీద ఉన్నవారే తీసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు.


బీజేపీ గెలుపులో బీఆర్ఎస్ పాత్ర  ఉందా ?


రెండు స్థానాల్లో బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ సహకరించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అయితే ఇందులో వాస్తవం ఎంత అని విశ్లేషించుకుంటే  అది నిజం కావచ్చు అనిపిస్తోంది.  ఉత్తర తెలంగాణలో  ఎన్నికలు జరిగిన  ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో గత శానస సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన స్థానాలు 19, బీఆర్ఎస్ గెలిచింది 16, బీజేపీ గెలిచింది 7.  మెజార్టీ స్థానాలు  కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది.  అయితే రెండో స్థానంలో నిలిచిన బలం బీఆర్ఎస్ పార్టీది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వ్యూహాత్మకంగానే బీఆర్ఎస్  అభ్యర్థులను నిలబెట్టలేదు  అయితే ఏ రాజకీయ పార్టీ  ఎన్నికల సమయంలో మౌనంగా ఉండదు. నేరుగా పోటీ పడటం లేదా సీపీఐ,  తెలంగాణ జన సమితి లాగా  ఏదో పార్టీకి  మద్ధతు ప్రకటించడం చేస్తుంటారు. లేదా లోపాయాకారిగా తమ ప్రత్యర్థి పార్టీ ఓటమికి రహస్యంగా  వ్యూహం పన్నుతారు . అంటే తమ ప్రధాన ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనే మరో పార్టీకి  ఎంతో కొంత, ఏదో రీతిలో సాయం చేస్తారు. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను , సీఎం రేవంత్ రెడ్డిని బలహీనపర్చాలంటే పోటీ చేయని బీఆర్ఎస్ అనివార్యంగా  బీజేపీకి సహకరించాల్సిందే.  అయితే ఇది బయటకు చెప్పకపోయినా అంతర్గతంగా , స్థానిక నేతలకు మౌఖిక ఆదేశాలు బీఆర్ఎస్ చీఫ్ నుంచి వెళితేనే ఆ పార్టీ శ్రేణులు బీజేపికి సహకరిస్తాయి. అయితే ఇది జరిగిందా లేదా అంటే  సాక్ష్యాలు చూపెట్టలేం కాని ఏ రాజకీయ పార్టీ కూడా  తన ప్రధాన ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టే అవకాశం వస్తే చూస్తూ ఊర్కోదు.



ఇక రాజకీయ చతురత కలిగిన గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ మాత్రం చూస్తూ కూర్చుంటారా అన్నది అందరి మెదళ్లలో నానే ప్రశ్న. కాంగ్రెస్ కు షాక్ తగిలేలా బీజేపీ  గెలిచిందంటే ఎంతో కొంత కమలం - గులాబీ పూవులు పరస్పరం కలిసి  ప్రయోజనాలు సాధించాయేమో అని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే బీజేపీ గెలుపుకు బీఆర్ఎస్ కారణమని కాంగ్రెస్ పార్టీ చెప్పి తప్పించుకోలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పాచికలు ఆయా రాష్ట్రాల్లో  చాలా సార్లు విసిరినవే.  అలాంటి వాటిని తట్టుకుని  గెలిస్తేనే అధికార పార్టీకి గౌరవం. ఆయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు మాత్రం రేవంత్ సర్కార్ గౌరవాన్ని తగ్గించాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.