HYDRA Demolitions: హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిని హైడ్రా వణికిస్తోంది. భాగ్యనగరంలో హైడ్రా కూల్చివేతలపర్వం కొనసాగుతోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ (HYDRA) అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు వాటిపై ఉక్కుపాదం మోపుతోంది.  హైదరాబాద్ నగరంలో చెరువులు,  బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాలు, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తుంది. తన మన బేధం లేకుండా ఎంతటి వారివైనా సరే కూల్చడం ఖాయమని తేల్చి చెబుతున్నారు సరే కూల్చుడే అని తేల్చిచెప్తున్నారు. ఏకంగా సీఎం సోదరుడి ఇంటిని కూడా హైడ్రా అధికారులు కూల్చేశారు. 


అధికారులపైకి స్టీరింగ్ తిప్పిన బుల్డోజర్
అయితే ఇప్పుడు హైడ్రా బుల్డోజర్ చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి ఇప్పుడు అనుమతులు ఇచ్చిన వారి పైకి మళ్లింది. అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులెవరనేది ఆరా తీసి మరీ 50 మందికి పైగా అధికారులను గుర్తించినట్లు తెలుస్తోంది. మొత్తానికి అధికారుల గుండెల్లో కూడా హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా సైబరాబాద్ ఈవోడబ్ల్యూ వింగ్ కు చెందిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వారిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు చెందిన అధికారులు కూడా ఉన్నారు.  


హైడ్రా సిఫారసుల మేరకు..


చందానగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధామ్స్.. బాచుపల్లి ఎంఆర్వోపై కేసు నమోదు చేశారు. అలాగే మేడ్చల్ మల్కాజిగిరి ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు,  హెచ్ ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి సుధీర్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. హెచ్‌ఎండీఏ సిటీ ప్లానర్‌ రాజకుమార్‌, నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణలపై కేసు నమోదు చేశారు. హైడ్రా సిఫారసుల మేరకు ఆయా అధికారులపై కేసులు పెట్టారు. హైదరాబాద్‌లో చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకున్నారు.  సీపీ అవినాష్ మహంతి హైదరాబాద్‌లో కేసులు నమోదు చేశారు. 



గగన్ పహాడ్ లో కూల్చివేతలు 
మొన్న హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్..  నిన్న రాంనగర్.. నేడు గగన్ పహాడ్ లో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి అప్నాచెరువు ఎఫ్డీఎల్ పరిధిని ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను గుర్తించి భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. అక్రమ నిర్మాణాల ప్రదేశంలోకి ఇతరులెవరినీ అనుమతించకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అప్నా చెరువు మొత్తం విస్తీర్ణం 34 ఎకరాలు..  అయితే అందులో మూడు ఎకరాలు కబ్జా చేసి గోడౌన్లను నిర్మించినట్టు గుర్తించారు. మొత్తం 15 ఎకరాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని నిర్మాణదారులను హెచ్చరించినప్పటికీ వారు స్పందించలేదు. రంగంలోకి దిగిన హైడ్రా మొత్తం 15 ఎకరాల్లో నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తుంది. అలాగే మియాపూర్ అక్రమ కట్టడాలపై రెవెన్యూ అధికారులు కొరడా ఝుళిపించారు. మియాపూర్ చెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టిన బిల్డర్‌పై కేసు నమోదు చేశారు.  


 ఆక్రమణ అంటే భయపడేలా చేస్తాం  
 హైడ్రా కూల్చివేతలతో బడా బాబులే కాదు సామాస్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు.  ఇక హైడ్రా చర్యల పైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా వ్యవస్థ కొద్దిరోజులు హడావిడి చేసి ఊరుకునే వ్యవస్థ కాదని ఎవరైనా ఆక్రమణ అంటేనే భయపడేలా చేస్తామని పేర్కొన్నారు. కొంతమంది అక్రమ నిర్మాణాలకు అధికారిక అనుమతుల ముసుగు తొడుగుతున్నారన్న రంగనాథ్ వారి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలోగా వాటిని నేలమట్టం చేస్తామంటూ హెచ్చరించారు.  



హైడ్రాకు అదనపు సిబ్బందితో ఫుల్ పవర్స్ 
హైడ్రా  ఫుల్ పవర్స్ తో దూకుడుగా వ్యవహరిస్తుంది.  కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో 72 బృందాలను ఏర్పాటు చేశారు. అదనపు సిబ్బందితో హైడ్రా పటిష్టంగా తయారైంది. ఇక నుంచి నోటీసుల నుంచి కూల్చివేతల వరకు అన్నీ హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు కానుంది. గతంలో నీటిపారుదల, పురపాలక శాఖలకు నోటీసులు జారీ చేయగా, ఇక నుంచి హైడ్రా పేరుతో నోటీసులు జారీ చేయనున్నారు. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన అధికారులపై హైడ్రామా ప్రత్యేక దృష్టి సారించింది. వీటన్నింటిని హిట్ లిస్టులో చేర్చి మరీ చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే 50 మంది అధికారులతో జాబితా సిద్ధం చేసిన హైడ్రా అధికారులు ఇప్పుడు ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.