YS Sharmila: రాష్ట్రంలో ప్రధానికి అడుగు పెట్టే అర్హత లేదంటున్న సీఎం కేసీఆర్ కు.. ఎదురెళ్లి మోదీని నిలదీసే దమ్ము లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. సీఎం కేసీఆర్ కు అడిగే దమ్ము లేదు, ఇచ్చే దమ్ము లేదంటూ ఫైర్ అయ్యారు. గత పదేళ్లుగా ఇలాగే వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైతే.. 5 ఏళ్లలో మోడీ వచ్చిన ప్రతీసారి మొహాలు ఎందుకు చాటేశారని ప్రశ్నించారు. విభజన హామీల సంగతి ఏంటని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. అలాగే తెలంగాణకు దక్కాల్సిన నిధులపై ఎందుకు నిలదీయలేదని వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు. 






పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులపై చేసిన పోరాటాలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు. కేంద్రం ఇస్తామన్న 2 కోట్ల ఉద్యోగాల్లో రాష్ట్ర వాటా ఏదని అడిగారా అంటూ సీఎం కేసీఆర్ ను నిలదీశారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ములుగు గిరిజన విశ్వ విద్యాలయం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీల సంగతిపై పోరాడారా అని అన్నారు. అలాగే ఏటా బడ్జెట్ లో రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుంటే మీ ఎంపీలు చేతకాని దద్దమ్మలు కాలేదా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ ఇదే "బీజేపీ రాష్ట్ర సమితి" దోస్తానా అంటూ చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ కు కుటుంబ క్షేమంపై ఆరాటం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమంపై సోయి రాదని.. కేసుల నుంచి తప్పించుకునేందుకు మోడీ వద్ద మోకరిల్లి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ కేసీఆర్ అండ్ కో కు రాష్ట్రంలో ఉండే అర్హతే లేదంటూ ఘాటు విమర్శలు చేశారు.


పార్టీ విలీనంపై ఈనెల 30వ తేదీలోగా నిర్ణయం


కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనంపై సోమవారం వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. పార్టీ విలీనంపై ఈ నెల 30వ తేదీలోపు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. విలీనం లేకపోతే వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌టీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తెలిపారు. ఒకవేళ విలీనం లేకపోతే తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో సింగిల్‌గా పోటీ చేసేందుకు వైఎస్సార్‌టీపీ సిద్దంగా ఉందని చెప్పారు. కార్యకర్తలు, నేతలు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడ్డవారికి సరైన ప్రాధాన్యత దక్కుతుందని షర్మిల పేర్కొన్నారు. విలీనంపై త్వరలో తుది నిర్ణయం తీసుకుంటానంటూ ఇటీవల వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలో షర్మిల ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. ఆ తర్వాత షర్మిల సైలెంట్ కావడంతో పార్టీ విలీనానికి బ్రేక్‌లు పడ్డాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా  విలీనం లేకపోతే ఒంటరిగా పోటీ చేస్తానని షర్మిల ప్రకటించడం కీలకంగా మారింది. దీంతో విలీనం ఉంటుందా..? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.