YS Sharmila Latest News: వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (YSRTP) వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. డిశ్చార్జి అయిన నాటి నుంచి షర్మిలకు రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించారు. ఆమరణ నిరాహార దీక్షకు వైఎస్‌ షర్మిల పూనుకోగా, శనివారం అర్ధరాత్రి పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి అపోలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆదివారం అక్కడ చికిత్స  పొందారు షర్మిల. దీక్ష కారణంగా లో బీపీ, బలహీనత ఉండటంతో వైఎస్‌ షర్మిలను అపోలో ఆస్పత్రిలో  చేర్పించినట్లు నిన్నటి బులిటెన్‌లో వైద్యులు తెలిపారు.


Sharmila Hunger Strike: నిరహార దీక్ష చేస్తూ ఆరోగ్యం క్షీణించి వైఎస్ షర్మిల రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల అరోగ్య పరిస్థితి పై అపోలో డాక్టర్లు నిన్న (డిసెంబరు 11) హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. లో బీపీ, బలహీనత, మైకం ఉండటం తో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు తెలిపారు.  ఆదివారం (డిసెంబర్ 11 వ తేదీన) తెల్లవారుజామున ఒంటి గంట తరువాత ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని చెప్పారు. ప్రస్తుతం ఆమెకు డీహైడ్రేషన్ సమస్యతో పాటు ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ ఉందని వైద్యులు వెల్లడించారు. మంచినీళ్లు కూడా తీసుకోకుండా నిరాహార దీక్ష చేయడంతో షర్మిల బాగా నీరసించిపోయారు. అయితే ఆమె ఆరోగ్యం గురంచి ఆందోళన చెందనక్కర్లేదని వైద్యులు చెబుతున్నారు.


2, 3 వారాలు విశ్రాంతి తీసుకోవాలి..


వైఎస్ షర్మిలకు తీవ్రమైన ఒలిగురియా, అధిక అయాన్ గ్యాప్ మెటబాలిక్ అసిడోసిస్ కండీషన్ తో పాటు ప్రీ-రీనల్ అజోటెమియా కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నామని, ఆదివారం రాత్రిలోగా లేదా సోమవారం ఉదయం డిశ్చార్జి చేసే అవకాశం ఉందన్నారు. కానీ షర్మిల ఆరోగ్య పరిస్థితి కారణంగా 2 - 3 వారాలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ వివరాలు ఆదివారం మధ్యాహ్నం అపోలో వైద్యులు వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితిని హెల్త్ బులెటిన్ ద్వారా వెల్లడించారు.


రెండ్రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష, క్షీణించిన ఆరోగ్యం


తాను చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని, అలాగే అరెస్టు చేసిన వైఎస్సార్ టీపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల రెండు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. పాదయాత్రకు అనుమతి ఇచ్చే వరకు దీక్ష విమరించే ప్రసక్తి లేదని షర్మిల తేల్చిచెప్పారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో షర్మిల దీక్ష చేశారు. ఓవైపు ఆమె ఆరోగ్యంపై వైఎస్సార్టీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దీక్ష చేపట్టిన చోటే షర్మిలను పరీక్షీంచిన వైద్యులు ఆమె ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపారు. పార్టీ ఆఫీస్ కు నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీస్ లు అడ్డుకునే ప్రయత్నం చేశారు.