YS Sharmila: స్వాతంత్ర్య దినోత్సవం రోజున గిరిజన మహిళ లక్ష్మీపై పోలీసుల దాడి అమానుషమని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ అన్నారు. రంగారెడ్డి జిల్లా బీఎన్ రెడ్డి నగర్ శ్యామ్ ఆస్పత్రి ముందు రోడ్డుపై షర్మిల బైఠాయించారు. గిరిజన మహిళ లక్ష్మికి తక్షణ న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ధర్నా కొనసాగిస్తానని షర్మిల స్పష్టం చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరిగినప్పుడు మనకు అసలైన స్వతంత్రం వచ్చిన రోజని గాంధీజీ చెప్పారని అన్నారు. మరి గిరిజన మహిళపై దాడి జరిగితే స్వాతంత్ర్యం వచ్చినట్లా రానట్లా అని ప్రశ్నించారు


అర్ధరాత్రి మహిళ అని చూడకుండా, స్వాతంత్య్రం వచ్చిన రోజు మహిళపై దాడి చేయడం అమానుషమన్నారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘ఇది గూండాలు, రౌడీలు చేసిన పని కాదు. రక్షణగా ఉండాల్సిన పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టారు. వారు స్వాతంత్ర్యాన్ని గౌరవించినట్లా ? ఈ పోలీసులకు రాజ్యాంగం అంటే గౌరవం లేదు. ఇండియన్ పీనల్ కోడ్ అంటే గౌరవం లేదు. పోలీసుల తీరు రోడ్డు మీద రౌడీలకు, రేపిస్టులకు తేడా లేదు. కాకి చొక్కా వేసుకున్నా గూండాలు పోలీసులు. ఆగస్ట్ 15 న పోలీసులకు మద్యం ఎక్కడ దొరికింది ? ఎస్సై, కానిస్టేబుళ్లు బాగా తాగి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మద్యం తాగి గిరిజన మహిళపై దారుణంగా ప్రవర్తించారు. 






వీళ్లను మృగాలతో పోల్చినా తప్పు లేదు. చర్యలు తీసుకున్నాం అని చెప్పి ఒకరిద్దరు అమాయకులను సస్పెండ్ చేశారు. దారుణానికి ఒడిగట్టిన ఎస్సై రవికుమార్‌ను మాత్రం ట్రా‌న్స్‌ఫర్ చేశారు. బాధితురాలు గుర్తు పట్టకుండా ఎలా చర్యలు తీసుకున్నారు? FIR నమోదు చేయకుండా మహిళపై థర్డ్ డిగ్రీ ఎలా ప్రయోగించారు? IPC లో మహిళలను కొట్టమని ఎక్కడ రాశారో చెప్పాలి. పోలీస్ శాఖ ఎందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయలేదు? పోలీసులు తప్పు చేస్తే శిక్ష పడాల్సిన అవసరం లేదా ? అర్ధరాత్రి మహిళ పోలీసులు లేకుండా లక్ష్మిని ఎలా అదుపులోకి తీసుకుంటారు? మహిళా పోలీసులు లేకుండా పోలీస్ వాహనంలో ఎలా ఎక్కించారు?


 అర్ధరాత్రి అని చూడకుండా తీసుకెళ్లి లాఠీలతో కొట్టారు. బూటు కాళ్లతో తన్నారు. వాతలు పడేలా కొట్టారు. ఎస్ఐ రవికుమార్‌తో పాటు మరో ఇద్దరు పోలీసులు చిత్ర హింసలకు గురి చేశారు. బండ బూతులు తిట్టారు.  పోలీసులది పైశాచిక ఆనందం. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులు అంట? ఎవరికి మీరు ఫ్రెండ్లీ పోలీసులు? మహిళలలు మీ కంటికి మనుషుల్లా కనపడరా? ఇది ఎక్కడి దారుణం? పెళ్లి ఉందని వేడుకున్నా వదలలేదు. బిడ్డ పెళ్లి కోసం తెచ్చుకున్న 3 లక్షలు, ఒంటి మీద ఉన్న నగలు కాజేశారు. మీరు అసలు మనుషులేనా? ప్రభుత్వం తరుఫున ఎటువంటి హామీలు లేవు. సబితా ఇంద్రా రెడ్డి వచ్చి ఏదో చెప్పారట. 


బాధితురాలికి 120 గజాల స్థలం ఇస్తామని సబితా ఇంద్రారెడ్డి అన్నారట. కానీ పబ్లిక్ గా ఆవిషయాన్ని ఎందుకు చెప్పలేదు? బాధితురాలికి వెంటనే రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. లక్ష్మిపై థర్డ్ డిగ్రీ ఘటనపై వెంటనే విచారణ కమిటీ వేయాలి. నేను వస్తానని తెలిసి రాత్రికి రాత్రి హాస్పిటల్ మార్చారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఇక్కడే ధర్నా చేస్తా’ అంటూ షర్మిల రోడ్డుపై బైఠాయించారు. భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. పోలీసులు షర్మిలను అరెస్ట్ చేసి తిప్పుతున్నారు. లోటస్ పాండ్‌కు తరలించే అవకాశం ఉంది.