KTR Challenge to CM Revanth: పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ వెంటే ఉన్నారని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే, నైతికత ఉంటే బీఆర్ఎస్ నుంచి అక్రమంగా చేర్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలతో తక్షణమే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) బహిరంగ సవాల్ విసిరారు. అప్పుడు ప్రజలు ఏ పక్షాన ఉన్నారో తేలుతుందని, దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని ఆయన అన్నారు. శుక్రవారం సిరిసిల్లలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ప్రజాదరణ ఉంటే నా సవాల్ను స్వీకరించగలరా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట మార్చడంలో సిద్ధహస్తుడని కేటీఆర్ విమర్శించారు. "నిన్న హైదరాబాద్ ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి మొదట కాంగ్రెస్ 66 శాతం గెలిచిందని, ఇది ప్రభుత్వంపై ప్రజల ఆశీర్వాదమని గొప్పలు చెప్పారు. కానీ సరిగ్గా ఐదు నిమిషాలకే మాట మార్చి.. ఇవి స్థానిక అంశాలపై జరిగిన ఎన్నికలని, ప్రభుత్వానికి సంబంధం లేదని తప్పించుకున్నారని" ఎద్దేవా చేశారు. "ముఖ్యమంత్రి గారూ.. మీకు నిజంగానే 66 శాతం ప్రజాదరణ ఉంటే నా సవాల్ స్వీకరించండి. మా పార్టీ నుంచి మీరు సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లిన ఆ పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. ఎవరి బతుకేంటో.. ఎవరి సత్తా ఎంత ఉందో ప్రజాక్షేత్రంలోనే తేలిపోతుంది" అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడియం, పోచారం కూడా దిగజారారు
పార్టీ మారిన ఎమ్మెల్యేల తీరుపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. మంత్రులుగా, స్పీకర్గా పనిచేసిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కేవలం 'గడ్డిపోచ' లాంటి పదవుల కోసం ఇంతలా దిగజారి వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. "బయట కాంగ్రెస్లో చేరామని మైకుల్లో ప్రగల్భాలు పలికి, రాహుల్ గాంధీ కండువా కప్పారని చెప్పుకున్న ఈ పెద్ద మనుషులు.. ఇప్పుడు స్పీకర్ విచారణలో మాత్రం తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పచ్చి అబద్ధాలు చెప్పడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం" అన్నారు. ముఖ్యమంత్రి ఒత్తిడితో స్పీకర్ కూడా ఆధారాలను పక్కన పెట్టి అబద్ధాలు చెప్పాల్సిన దుస్థితికి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. "ఆటలో అంపైర్లా ఉండాల్సిన స్పీకర్, తాము ఇచ్చిన ఆధారాలను పక్కన పెట్టి ముఖ్యమంత్రి చెప్పినట్లు అబద్ధాలు ఆడటం అనైతికమని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి సంతలో పశువుల్లా ఎత్తుకెళ్లారని, ఆ 10 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు పూర్తిగా అంధకారమైపోయిందని ధ్వజమెత్తారు.
2026లో కొత్త సభ్యత్వాలు, కొత్త కమిటీలు
రైతులను, మహిళలను, బీసీలను మోసం చేసినందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అధికార యంత్రాంగాన్ని, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారని స్పష్టం చేశారు. "సిరిసిల్లలో 117 పంచాయతీలకుగాను 80 చోట్ల బీఆర్ఎస్ గెలవడమే దీనికి నిదర్శనం" అని చెప్పారు. బెదిరింపులకు, ఫోన్ కాల్స్కు కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. "గెలిచిన వారు, ఓడిపోయిన వారు కలిసి పనిచేయాలి. వచ్చే ఏడాది కొత్తగా సభ్యత్వ నమోదు చేపట్టి.. గ్రామ, మండల, జిల్లా కమిటీలను వేసుకుంటాం. పాత తరం అనుభవం, కొత్త రక్తం కలిసేలా చురుకైన యువతతో కమిటీలు వేసి పార్టీని మరింత బలోపేతం చేస్తాం" అని ప్రకటించారు. రాబోయే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రభంజనం కొనసాగిస్తామని ఆయన పిలుపునిచ్చారు.