Errabelli Dayakar Rao on Empowerment of women: వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు సాధికారత పెరిగిందని, ముసలోళ్లకు గౌరవం దక్కిందని, మహిళలు ఆర్థికంగా, వ్యాపారులుగా ఎదుగుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మహిళలకు గౌరవం దక్కింది ఇద్దరే ముఖ్యమంత్రుల హయాంలోనేనని.. ఒకరు ఎన్టీఆర్ అయితే, మరో సీఎం కేసిఆర్ అని కొనియాడారు. తొర్రూరులో శ్రీ వాణి ఎడ్యుకేషనల్ & సోషల్ సర్వీస్ సొసైటి వ్యవస్థాపకురాలు డాక్టర్ నాగవాణి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని ఆయా రంగాల్లో విశేష కృషిచేసిన మహిళామణులను శాలువాతో సన్మానించి, అభినందించారు.


ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మనందరం సావిత్రిబాయి పూలే ఆశయాలను ముందుకు తీసుకుని పోతున్నాం అని సావిత్రి బాయి పూలే 192వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నాం  అన్నారు. తాను మొదట్లో ఎమ్మెల్యేగా అయినపుడు అక్కడికి వెళ్ళినపుడు చూడడానికి బయటకు మహిళలు రావడానికి కూడా వెనుకాడే వారని, చాటుకు ఉండి చూసేవాళ్ళు అని.. అప్పట్లో మహిళల పరిస్థితి అలా ఉండేది ఇప్పుడు మహిళలకు అత్యంత గౌరవం పెరిగిందన్నారు. 


మహిళలకు గౌరవం దక్కింది ఇద్దరే ముఖ్యమంత్రుల హయాంలోనే ఒకరు ఎన్టీఆర్ అయితే, మరో సీఎం కేసిఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్  సీఎంగా ఉన్నపుడు మహిళల కోసం మొదటగా డ్వాక్రా గ్రూపులు పెట్టారు.- డ్వాక్రా సభ్యులు కూడా డబ్బులు జమ చేయడానికి బ్యాంక్ కు వచ్చినా బయటకు వచ్చినా బదనాం చేసేవాళ్లు అని అన్నారు. అప్పట్లో తల్లి వాళ్ళు ఇంటికి వస్తే కోడి కోయడానికి భర్తలను బతిలాడే వాళ్ళు అని, కానీ ఇప్పుడు భార్యలను బతిమిలాడే పరిస్థితి వచ్చిందన్నారు. ఇపుడు మగవాళ్ళ దగ్గర డబ్బులు లేవని, మహిళలు ఐకేపీ, స్త్రీ నిధి ద్వారా వ్యాపారాలు, పారిశ్రామిక వేత్తలు అవుతున్నారు. మంచి చదువులు చదువుకుని ఉద్యోగాలు, ఉపాధి పొందుతున్నారని ఇదే మహిళా సాధికారత అని ప్రోత్సహించారు.


మొదట పెన్షన్ విధానం ఎన్టీఆర్  ప్రవేశ పెట్టారు. ఆ పెన్షన్ బాగా పెంచి ముసల్లోళ్లకు గౌరవం సీఎం కేసీఆర్ కల్పించారు. కళ్యాణ లక్ష్మి మంచి పథకం అన్నారు. అప్పట్లో ఆడపిల్ల పెళ్లికి మేనమామ చీర తెచ్చేది. కానీ ఇప్పుడు మేనమామ కేసీఆర్  అయ్యారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఆడపిల్ల పెళ్లికి 1 లక్షా 116 రూపాయలు ఇస్తున్నారు. ఇంత ఎక్కువ పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి పథకం దేశంలో ఎక్కడా లేవు. గతంలో ఊర్లకు వెళ్తే బోర్ల కోసం కొట్లాడే వాళ్ళు. నీళ్ళ కోసం పంచాయతీ ఉండేది. ఎమ్మెల్యే నిధులన్నీ బోర్లకు సరిపోయేవి. కానీ ఇపుడు మిషన్ భగీరథ వల్ల ఆ నీటి గోస పూర్తిగా తీరింది. ఇపుడు ఎమ్మెల్యే నిధులు వేరే వాటికి ఉపయోగ పడుతున్నాయి.


మహిళలు చదువుకుంటే ఆ కుటుంబాలు బాగుపడతాయి. మహిళలు ఆర్ధికంగా పైకి వచ్చే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. సన్మాన గ్రహీతలలో అమర్ సింగ్ తండా, అంగన్వాడీ టీచర్ కమలా దేవి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు పంజా కల్పన, స్కూల్ అసిస్టెంట్ జ్యోతి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ స్వప్న, లయన్స్ క్లబ్ దీప, ఆశా కార్యకర్త తొర్రూరు రేణుక , ఐకేపీ కార్యకర్త రేణుక, జూనియర్ లెక్చరర్ 
షీలా బేగం, మైనారిటీ స్కూల్ టీచర్ రజిత తదితరులు ఉన్నారు.