Telangana Ministers Vs Harish Rao: తెలంగాణలో వారం పదిరోజులుగా కాగుతున్న నీళ్ల పంచాయితీ ఇంకా చల్లారలేదు. అసెంబ్లీ లోపల బయట దీనిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం ప్రయత్నిస్తుంటే.. గత ప్రభుత్వ హయంలో ఇన్ని అక్రమాలు జరిగాయని రేవంత్ సర్కారు ప్రజల ముందు రిపోర్టులు పెడుతోంది. 
కాంగ్రెస్, బీఆర్‌ఎసస్ మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా నేడు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఇవాళ ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టారు. దీని కారణంగా మరోసారి ఇరు వర్గాల మధ్య హోరాహోరీగా మాటల తూటాలు పేలాయి. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సభలో తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత మాట్లాడిన మాజీ మంత్రి హరీష్‌రావు కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా హరీష్‌రావుకు మంత్రుల మధ్య వర్డ్స్‌ వార్‌ జరిగింది. 


హరీష్‌రావు మాట్లాడుతున్నంత సేపు మంత్రులు అభ్యంతరం చెబుతూనే ఉన్నారు. ఆయన చేసే కామెంట్స్‌కి, చెప్పే విషయంపై కౌంటర్‌లు వేస్తూనే ఉన్నారు. ఒక్కోచోట ఒక్కోలా లెక్కలు చెప్పారని ఆరోపించారు హరీష్‌రావు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి మొదలైన వాగ్వాదం సభ వాయిదా పడే వరకు సాగుతూనే ఉంది. హరీష్‌రావు సుమారు గంటన్నర మాట్లాడితే అందులో 40 నిమిషాల పాటు అధికార పార్టీ అభ్యంతరాలే ఉన్నాయి. 


ఈ విషయంపై అసెంబ్లీ లాబీల్లో హరీష్‌రావు కీలక కామెంట్స్‌ చేశారు. తాను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్‌చేయడం అధికార పార్టీకి అలవాటుగా మారిందన్నారు. కీలకమైన విషయాలు చెప్పేటప్పుడు మైక్ కట్ చేయడంతోపాటు కెమెరాను కూడా తమవైపు తిప్పడం లేదని ఆరోపించారు. అధికార పార్ట నేతలు  స్పీకర్‌కు స్లిప్‌ పంపించడం వారు అనుమతి ఇవ్వడం జరిగిపోతుందన్నారు. అయినా తాను వెనక్కి తగ్గబోనని తన డ్యూటీ తాను చేస్తాన్నారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని... దాన్ని సరి చేసి సాగు నీరు అందించామన్నారు హరీష్‌రావు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ ఇంజనీరింగ్ అధికారుల సలహాతోనే రీడైన్ చేశామన్నారు. తమ ప్రయత్నాలు కారణంగానే తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తమ పాలనలో వలసలు తగ్గాయని... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఇక్కడ వచ్చి పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ ఘటన తమ పార్టీకే చెందుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్‌ హయాంలో కరవు కారణంగా ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారని... జరిగిన అన్యాయంపై కవులు కళాకారులు గళమెత్తారని గుర్తు చేశారు. 


దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రులు హరీష్‌ తీరుపై మండిపడ్డారు. ఆయన గ్లోబెల్స్‌ కంటే దారుణంగా అబద్దాలు చెబుతున్నరని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్‌ మాట్లాడుతూ.... పక్క రాష్ట్రాల్లో ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు కేంద్రానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫిర్యాదు చేయలేదన్నారు. దీనిపై గతంలోనే ఆధారాలు ఇచ్చామన్నారు హరీష్‌ అయినా అవే అబద్దాలు పదే పదే చెబుతున్నారని హరీష్‌ ధ్వజమెత్తారు. గతంలో కాగ్‌ రిపోర్టులకు విలువలేదని కాంగ్రెస్ నాయకులు చెప్పారని ఇప్పుడు అదే కాగ్‌ రిపోర్టు ఇప్పుడు పరమ పవిత్రంగా భావిస్తున్నారని అన్నారు. ఇలా సభ జరుగుతున్నంత సేపు హరీష్‌ రావు ఒక్కడి ఒకవైపు మంత్రులు మరోవైపు హోరాహోరీగా సాగింది మాటల యుద్ధం.