Kavitha Fire On Revanth Reddy: సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్‌ఎస్ మధ్య వార్‌ తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల నాటి హీట్ తగ్గక ముందే ఇప్పుడు పార్టీలో జోష్ నింపేందుకు ప్రజలను ఆకట్టుకునేందుకు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మీరు ఒకటంటే మేం పది అంటాం అన్నట్టు సాగుతోందీ విమర్శల పర్వం 


ప్రాజెక్టుల అప్పగింతపై రగడ


కృష్ణా నదిపై ప్రాజెక్టులను కేంద్ర పర్యవేక్షణకు అప్పగించడంతో మొదలైన వార్ ఇప్పుడు తీవ్రస్థాయికి చేరుకుంది. ప్రభుత్వం వచ్చిన రెండు నెలల్లోనే ప్రాజెక్టుల పెత్తనం కేంద్రానికి అప్పగించాలని బీఆర్‌ఎస్‌ నేతలు, వారిని సమర్థించే మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రత్యారోపణలు చేశారు. 


కేసీఆర్‌పై రేవంత్ ఆగ్రహం 


కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు నీటి పారుదల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాజెక్టులు అప్పగిస్తోందంటూ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గతంలో కృష్ణా నదీ ప్రాజెక్టులపై తెలంగాణకు ఆధిపత్యం ఉండగా.. వైఎస్, చంద్రబాబు, జగన్ ఒత్తిళ్లకు కేసీఆర్ లొంగిపోయారు. పదవులు, కమీషన్లకు లొంగి జల దోపిడీకి సహకరించారు. SLBC, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసుంటే 10 లక్షల ఎకరాలకు నీరు అంది ఉండేది. ఉమ్మడి ఏపీ కంటే ఎక్కువ నిర్లక్ష్యం తెలంగాణలోనే జరిగింది. ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోకుండా కేసీఆర్ పదేళ్లు ఏం చేశారు.?' అని సీఎం నిలదీశారు.


స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీఆర్‌ఎస్


దీనిపై అటు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా అంతే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ క్రమంలోనే బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. రేవంత్‌ రెడ్డిని చెప్పుతో కొడతా నా కొడకా అంటూ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లాలో పార్లమెంటు స్థాయి సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్ పై అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేయడంపై బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్‌ను లంగా అని మాట్లాడుతున్నాడు రండగాడు.. హౌలే గాడు రేవంత్ రెడ్డి’’ అని బాల్క సుమన్ వ్యాఖ్యనించారు. చెప్పు తీసుకొని కొట్టినా తప్పులేదని చేతుల్లోకి చెప్పు తీసుకుని మరీ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్కారం అడ్డొచ్చి ఆగుతున్నాం అంటూ మాట్లాడారు.


బాల్క సుమన్ వ్యాఖ్యలతో దుమారం


రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వ్యాఖ్యలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తీవ్రంగా ఖండించారు. బాల్క సుమన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్క సుమన్ ఎక్కడో వేరే జిల్లా నుంచి వచ్చి మంచిర్యాల జిల్లాలో పెద్దతనం చేస్తానంటే కుదరదని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లడుతూ చెప్పు చూయిస్తూ అసభ్యకర మాటలతో మాట్లాడడం సరైనది కాదని అన్నారు. బాల్క సుమన్ ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుతగిలి తగిన శాస్తి చేస్తారని అన్నారు. ఇక్కడ ఎవరి ఆటలు కొనసాగవని హెచ్చరించారు. బాల్క సుమన్ చేసిన ఆగడాలు, రాసలీలలు అన్ని త్వరలో బయటపెడతానని అన్నారు.


సుమన్‌పై కేసు రిజిస్టర్ 


మరో అడుగు ముందుకేసిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై కేసు కూడా పెట్టారు. బాల్క సుమన్ చెప్పుతో కొడతా అని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై చెప్పు చూపిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల అతడిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయింది.





కేసులు పెట్టడంపై కవిత ఆగ్రహం  


ఇలా సమస్యలపై నిలదీసిన వ్యక్తిని కేసులతో వేధించడం ఏంటనీ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ట్విట్టర్ వేదిగా స్పందించిన ఆమె... కేసీఆర్‌పై రేవంత్ చేసిన కామెంట్స్‌ను ఖండించారు. దళిత బిడ్డైన వ్యక్తిపై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు.  నాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు తెలంగాణలో ఉన్న ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన కూడా అవలంభించడం రాచరిక వ్యవస్థను తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. సూర్యుని పై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోకండని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అసభ్య పదజాలాన్ని ప్రయోగించినందుకు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయించి ప్రభుత్వ, పోలీసుల వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.