Bharath Rice Sale KG RS 29 Only: సాధారణ, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి ఉండేలా కేంద్ర ప్రభుత్వం భారత రైస్ పేరుతో అతి తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశవ్యాప్తంగా ఈ రైస్ ను మంగళవారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ బియ్యాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చే పథకాన్ని కేంద్రమంత్రి పీయుష్ గోయల్ ఢిల్లీలో మంగళవారం ప్రారంభించనున్నారు. దేశంలోని బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్రం 'భారత్‌ రైస్‌' (Bharat rice) పేరిట బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న (మంగళవారం) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.


నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి 


కేంద్రం తీసుకువస్తున్న భారత్ రైస్ కిలో రూ.29కే అందించే పథకాన్ని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) దిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (FCI) నుంచి సేకరించిన ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య(NAFED), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు. ఈ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో తీసుకువచ్చారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ వేదికల్లో విక్రయిస్తున్నారు. ఈ విక్రయాలకు మంచి స్పందన వస్తుండగా,  భారత్‌ రైస్‌కు అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది.


ఇలా కొనుగోలు చేయొచ్చు..


ఈ భారత్ రైస్ కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping లోకి వెళ్ళాలి. ఇక్కడ భారత రైస్ తో పాటు పప్పు, శనగపిండి వంటి ఇతర ఉత్పత్తులు కూడా ఉంటాయి. నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడే కాకుండా ఇతర ఈ కామర్స్ సైట్లలో నుంచి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. బహిరంగ మార్కెట్లతో పోలిస్తే సగానికి పైగా తక్కువ ధరకు బియ్యం లభిస్తుండడం, అందులోనూ నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండడంతో వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.