RBI MPC Meet February 2024: సామాన్యుడి ఇంటి బడ్జెట్‌ను నేరుగా ప్రభావితం చేసే రెపో రేట్‌ను నిర్ణయించేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్య విధాన కమిటీ (RBI MPC) సమావేశమైంది. ఈ రోజు (06 ఫిబ్రవరి 2024) ప్రారంభమైన RBI MPC మీటింగ్‌, మూడు రోజుల పాటు జరుగుతుంది. 


రెపో రేట్‌ పెరిగితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు పెరుగుతాయి. రెపో రేట్‌ తగ్గితే బ్యాంక్‌ వడ్డీ రేట్లు తగ్గుతాయి. బ్యాంక్‌ వడ్డీ రేట్లు దేశంలో కోట్లాది ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. 


ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das) నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల MPC భేటీ కొనసాగుతోంది. గురువారం వరకు జరిగే సమావేశంలో, రెపో రేట్‌పై తన వైఖరిని ఆర్‌బీఐ నిర్ణయిస్తుంది. ఈ మూడు రోజుల చర్చల ఫలితాలను గురువారం (08 ఫిబ్రవరి 2024) ఉదయం 11 గంటల సమయంలో ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటిస్తారు. 


రెపో రేట్‌ను ఆర్‌బీఐ పెంచితే, దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లు మరింత ఖరీదుగా మారతాయి. రెపో రేట్‌ తగ్గితే వడ్డీ రేట్లు దిగి వస్తాయి. రెపో రేట్‌ స్థిరంగా ఉంటే, బ్యాంక్‌ వడ్డీ రేట్లు యథాతథంగా/స్వల్ప మార్పులతో కొనసాగుతాయి. 


ఈసారి కూడా స్టేటస్‌ కో!


అయితే, రెపో రేట్‌ ఈసారి కూడా మారకపోవచ్చని, దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్‌ను యథాతథంగా కొనసాగిస్తుందని ఎక్స్‌పర్ట్స్‌ భావిస్తున్నారు. ఇతర కీలక రేట్లలో... స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేట్‌ను 6.25% వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేట్‌ & బ్యాంక్ రేట్‌ను కూడా మార్చకుండా 6.75% వద్దే ఆర్‌బీఐ ఉంచుతుందని అంచనా వేస్తున్నారు.


2023 డిసెంబర్‌లో జరిగిన ఆర్‌బీఐ ఎంపీసీ మీటింగ్‌ సహా, గత ఐదు ద్రవ్య విధానాల్లోనూ రెపో రేట్‌ను సెంట్రల్ బ్యాంక్ మార్చలేదు. ఈసారి కూడా అదే వైఖరిని కొనసాగిస్తే, వరుసగా ఆరో సారి కూడా రెపో రేటును మార్చకుండా 'స్టేటస్‌ కో' కంటిన్యూ చేసినట్లు అవుతుంది.


2022 మే - 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో RBI రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచి 6.50%కి చేర్చింది. చివరిసారిగా, 2023 ఫిబ్రవరిలో రెపో రేటును 6.50%కి పెంచింది. అప్పటి నుంచి ఇదే రేటు కొనసాగుతోంది. 


బలమైన GDP వృద్ధి, అధిక స్థాయిలో GST వసూళ్లు MPC భేటీలో కీలక పాత్ర పోషిస్తాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందనడానికి ఇవి గట్టి సూచనలు. అయితే, దేశంలో ద్రవ్యోల్బణం, ముఖ్యంగా ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఆహార పదార్థాల్లో.. సామాన్య ప్రజలు నిత్యం కొనే కూరగాయలు, ఉప్పుపప్పులు, పాలు & అనుబంధ ఉత్పత్తులు ఇలా అన్నింటి ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఈ అంశం కూడా రెపో రేట్‌ నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంది. 


CPI ద్రవ్యోల్బణం రేట్‌, వరుసగా నాలుగో నెలలోనూ, ఆర్‌బీఐ గరిష్ట సహన పరిమితి అయిన 6% లోపే ఉంది. 2023 డిసెంబర్‌లో ఇది 5.69% గా నమోదైంది. నవంబర్‌లోని 5.55% నుంచి కొంచెం పెరిగినా, మార్కెట్‌ అంచనా 5.87% కంటే మెరుగ్గా ఉంది. అయితే, ఆహార ద్రవ్యోల్బణం మాత్రం 8.7% నుంచి 9.5% కు పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం వల్లే CPI ఇన్‌ఫ్లేషన్‌ గత నాలుగు నెలల్లోనే అత్యధికంగా డిసెంబర్‌లో 5.69% కు చేరింది.


దేశాభివృద్ధికి మద్దతునిస్తూనే, ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యిత స్థాయికి దిగి వచ్చేలా.. మార్కెట్‌ స్నేహపూర్వక వైఖరిని తగ్గించడంపై ఎంపీసీ దృష్టి పెట్టొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.


రెపో రేట్‌ను ఆర్‌బీఐ ఎప్పుడు తగ్గిస్తుంది?


ఆర్‌బీఐ ఎంపీసీ తదుపరి సమావేశం 2024 ఏప్రిల్‌లో ఉంటుంది. అయితే, ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి, అంటే, జూన్‌ మీటింగ్‌ నుంచి రేట్‌ కట్స్‌ పారంభం కావచ్చని ఎక్కువ మంది ఎక్స్‌పర్ట్స్‌ అంచనా వేస్తున్నారు. జూన్‌ మీటింగ్‌లో 25 బేసిస్‌ పాయింట్ల మేర రెపో రేట్‌ తగ్గొచ్చని భావిస్తున్నారు.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి