Notices to Venu Swamy: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందాయి. ఇటీవల ఆయన చేసిన వివాదాస్పద వీడియోపై ఆయనకు కమిషన్ నోటీసులు ఇచ్చింది. నాగ చైతన్య, శోభిత దూళిపాళ నిశ్చితార్థం అనంతరం వేణుస్వామి.. వారి భవిష్యత్ వివాహ బంధంపై జాతకం చెప్తూ ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. నాగ చైతన్య, శోభిత ఇద్దరూ విడిపోతారని అందులో వేణుస్వామి చెప్పారు. ఇంకా మరెన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.




ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఆగస్టు 12న తమకు ఫిర్యాదు ఇచ్చారని, దాని ప్రకారం.. వేణుస్వామికి నోటీసులు జారీ చేశామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ ఎన్ శారద ఓ ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 22న వ్యక్తిగతంగా వేణు స్వామి హాజరు కావాల్సి ఉంటుందని అందులో పేర్కొన్నారు.


నాగ చైతన్య - శోభిత పెళ్లి చేసుకున్న తర్వాత మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారని జ్యోతిషం చెప్పారు. 2027లో వీరు విడిపోతారని.. పర స్త్రీ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేశారు. పైగా నాగ చైతన్య - సమంత జాతకానికి తాను 50 మార్కులు వేస్తానని.. అదే నాగ చైతన్య - శోభిత జాతకానికి తాను 10 మార్కులే వేస్తానని అన్నారు. వీరి ఇద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషించిన వీడియో బాగా వైరల్ అయ్యింది.