UPSC 2023 Ranker 3 Ananya Reddy: 2022లో దరఖాస్తు చేసినా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కు ఆమె హాజరు కాలేదు. 2023 సివిల్స్ 3వ ర్యాంకర్ గా నిలిచి తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించారు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్యారెడ్డి. మాక్ ఇంటర్వ్యూలో సివిల్స్ టాప్ ర్యాంకర్లలో ఒకరైన అనన్యారెడ్డి చేసిక కీలక వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాలతో పాటు రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ ఏర్పడటానికి ముఖ్య కారణాలు ఏంటన్న ప్రశ్నకు.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం, తమ సంస్కృతి, సాంప్రదాయాలపై, ఆర్థిక అవసరాలపై వివక్ష చూపడం ఓ కారణమని అభిప్రాయపడ్డారు. విద్యార్థులతో కలిసి రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని ముందుకు నడిపాయి. నీళ్లు, నిధులు, నియామకాలు కోసం రాష్ట్ర ఉద్యమం కొనసాగిందని అనన్యా రెడ్డి బదులిచ్చారు. 


తెలంగాణ రాష్ట్ర సాధన అనేది మాజీ సీఎం కె.చంద్రశేఖరరావు వ్యక్తిగత అజెండానా, కేవలం 10 ఏళ్లలోనే రాష్ట్ర ప్రజలు ఆయనను ఎందుకు వద్దనుకున్నారు అని ప్రశ్న ఎదురైంది. రాజకీయ కారణం ఉన్నప్పటికీ, ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర సాధన అనేది కేసీఆర్ భావించారని చెప్పారు. దాదాపు 20 ఏళ్లు ముందుండి ఆయన ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని సాధించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర సాధనే ముఖ్యమని భావించి కేసీఆర్ ఉద్యమం కొనసాగించారని ఆమె అభిప్రాయపడ్డారు.


తెలంగాణ కొత్త రాష్ట్రం అయినపప్పటికీ కేసీఆర్ పాలనతో అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించింది. దేశ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువ అయిందన్నారు. 2014తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రెట్టింపు అయింది. ఐటీ రంగంలో మరింత అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. 


పదేళ్ల పాలనతో అధికారం ఎందుకు కోల్పోయారు?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, కానీ.. వ్యవసాయరంగం, ఇండస్ట్రీ, యువతకు ఉద్యోగాల కల్పనలో మరింత చేయాల్సి ఉందన్నారు. సాధారణంగా వరుసగా రెండు పర్యాయాలు అధికారంలో ఉంటే ప్రజల్లో కొంత వ్యతిరేకత రావడం సహజమేనన్నారు అనన్యా రెడ్డి. ఇలాంటి కారణాలతో కేసీఆర్ అధికారం కోల్పోయారని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ పలు రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్న ఆమె, 2 పర్యాయాలు అధికారంలో ఉండటంతో తలెత్తే ప్రభుత్వ వ్యతిరేకత వల్లే అధికారానికి దూరమయ్యారని అనన్యా రెడ్డి బదులిచ్చారు. ఆమె ఆలోచించి, చాలా తెలివిగా సమాధానాలు చెబుతున్నారని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి సైతం మెచ్చుకున్నారు.


విశ్వగురువు అంటే ఏంటి..
‘ప్రపంచానికి భారత్ ఏం చేసిందో చెప్పడానికి విశ్వగురు కాన్సెప్ట్ వచ్చిందన్నారు. భారత్ ఓ లీడర్, పరిపాలనతో పాటు వసుదైక కుటుంబం అనే ఐడియాలజీలో ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. సాఫ్ట్ పవర్, హార్డ్ పవర్ ను బ్యాలెన్స్ చేస్తున్న ఏకైక దేశం హారత్. ఇలాంటి ఎన్నో అంశాలతో భారత్ విశ్వగురువుగా నిలిచిందని’ అనన్యా రెడ్డి అభిప్రాయపడ్డారు.


సాఫ్ట్‌వేర్ లో భారత్ కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉందన్నారు. ర రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు వచ్చాయి. కరోనా తరువాత పలు దేశాల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. చైనా ఆర్థిక వ్యవస్థ పలు దేశాలతో పాటు భారత్ పై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే ఉత్పత్తుల దిగుమతులలో భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడి ఉంది. చైనాలో ఫార్మా, కొన్ని రంగాల్లో ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం సరిహద్దు దేశమైన భారత్ పై పడుతుంది. విస్తీర్ణంలో మొదటి  4 అతిపెద్ద దేశాలు ఏంటన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోయారు. తొలి రెండు పెద్ద దేశాలు రష్యా, కెనడా అని చెప్పిన అనన్యా రెడ్డి నాలుగో పెద్ద దేశం అమెరికా అని బదులిచ్చారు. అయితే మూడో పెద్ద దేశం అమెరికా, నాలుగో స్థానంలో చైనా ఉందని ఇంటర్వ్యూయర్ చెప్పారు. విస్తీర్ణంలో భారత్ స్థానం ఎంతన్న ప్రశ్నకు 7 అని ఆమె సరైన సమాధానం ఇచ్చారు.