Union Minister Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరగం లేఖ రాశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించిన ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించే స్వమిత్వ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. గతేడాది జులై 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఇదే విషయమై లేఖ రాసినట్లు గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్ చొరవ చూపించాలని కోరారు. గ్రామీణ భారతదేశంలోని ప్రజలకు వారి గృహాలకు సంబంధించిన ఆస్తి ధ్రువీకరణ పత్రాలను అందించి, ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభించినట్లు తెలిపారు. అలాగే జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 2021 ఏప్రిల్ 24వ తేదీ సర్వే ఆఫ్ విజిలెన్స్ ఆబాది అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారఁంభించారని తెలిపారు. ఈ పథకాన్ని ఆర్థికంగా ప్రారంభించడానికి ముందే హర్యానా, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా అమలు చేయడం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. 






తెలంగాణలో ఈ పథకానికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తైన సందర్భంగా... రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని కోరుతూ... 2022 జులై 29వ తేదీన లేఖ రాసినట్లు గుర్తు చేశారు. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖకు సంబంధించిన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈ లేఖ రాశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. అలాగే సీఎం కేసీఆర్ ఈ పథకం విషయంలో చొరవ చూపించి అమలు చేయాలని కోరారు. గ్రామీణ ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చే గృహాల సర్వేకు సంబంధించిన ఈ స్వమిత్వ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను సత్వరమే ప్రారంభించాలన్నారు.