TSRTC Bumper Offer: తెలంగాణ ఆర్టీసీ తరచుగా ఆఫర్లు ప్రకటిస్తూ.. ప్రయాణికులను తెగ ఆకట్టుకుంటోంది. మొన్న75వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్బంగా అనేక ఆఫర్లు ఇచ్చిన టీఎస్ఆర్టీసీ తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఏదైనా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించుకునేందుకు వెళ్లి, అక్కడి వైద్యులను సంప్రదించాక తిరిగి ఇంటికి వెళ్తున్నపుడు 2 గంటల వరకు ఫ్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించవచ్చు. ఆసుపత్రిలో వైద్యులు రాసిన మందుల చిట్టీపైనే సమయాన్ని సూచిస్తారు. ఆ చిట్టీని కండక్టర్ కు చూపిస్తే ఉచితంగా ప్రయాణించడానికి వీలు ఉంటుంది. భాగ్య నగరంలో ఎక్కడి వరకైనా ఇలా ఉచితంగా ప్రయాణించవచ్చు. 


అలాగే రాష్ట్రంలోని వేరే ప్రాంతాల నుంచి నగరానికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు కూడా టీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. ఎంజీబీఎస్, జీబీఎస్ బస్ స్టేషన్లతో పాటు భాగ్య నగరంలో ఎక్కడ దిగినా.. తర్వాత రెండు గంటలు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణించ వచ్చని రంగారెడ్డి రీజియన్ మేనేజర్ సామ్యుల్ తెలిపారు. 


స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బంపర్ ఆఫర్లు.. 
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి ప్రతి పండుగకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ.. ప్రయాణికులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు 75 ఏళ్లు దాటిన వారికి రేపు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్సిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. పంద్రాగస్టు నాడు పుట్టిన పిల్లలకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఒక కిలో లోపు కార్గో పార్శిళ్లకు ఉచిత రవాణా సౌకర్యం అందించారు. అయితే మేలో జరిగిన పదో తరగతి విద్యార్థుల పరీక్షల సమయంలో విద్యార్థుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. పరీక్షలు జరిగినన్ని రోజులు విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. అలాగే విమానాశ్రయానికి వెళ్లి, వచ్చే ప్రయాణికులకు సరికొత్త ఆఫర్ ప్రకటించారు. 


పుష్పక్ బస్సులో మూడు గంటల ప్రయాణం ఫ్రీ.. 
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి వచ్చేందుకు పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి గ్రేటర్ ఆర్టీసీ హైదరాబాద్ జోన్ మూడు గంటల పాటు సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అద్భుత అవకాశాన్ని కల్పించింది. విమానాశ్రయం నుంచి పుషఅపక్ బస్సుల్లో ప్రయాణించిన టికెట్ చూపించి.. మన నివాస ప్రదేశం చేరేందుకు టికెట్ ఖరీదు చేసిన మూడు గంటల వరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ తెలియజేసింది. ఈ సౌకర్యాన్ని పుష్పక్ ప్రయాణికులు వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. 


పికప్ అండ్ హోం డెలివరీ సేవలు.. 
అలాగే కార్గో పార్శిల్ సేవల ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఆర్టీసీ కార్గో, పార్సిల్ సేవలను విస్తరించాలని యాజమాన్యం నిర్ణయించింది. పికప్, హోం డెలివరీ స్వేలను ప్రారంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వేగంగా, భద్రంగా, చేరువగా అనే లక్ష్యంతో ఈ సేవల్ని ప్రారంభించిన ఆర్టీసీ అనతి కాలంలోనే ప్రయాణికల ఆదరణను చూరగొంది. 177 బస్ స్టేషన్లతో పాటు అధీకృత ఏజెంట్ల ద్వారా కొనసాగిస్తున్న పార్సిల్ సేవలు.. బుకింగ్, డెలివరీ పాయింట్ల నుంచే కాకుండా నేరుగా వినియోగదారుల ఇంటి వద్దకే సేవల్ని అందించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.