ప్రజాకర్షణే లక్ష్యంగా తెలంగాణ ఆర్టీసీ సంస్థ పని చేస్తోంది. అందుకోసం వేర్వేరు రూపాల్లో జనాలకు దగ్గర అయ్యేలా విధానాలను రూపొందిస్తూ ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితం - సుఖవంతం అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అందరూ ప్రభుత్వ బస్సులను ఆదరించాలనే లక్ష్యంతో సంస్థ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా గీతాలను రూపొందిస్తోంది. తాజాగా ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల పాడిన ఆర్టీసీ పాటను విడుదల చేశారు.


హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్‌) లో ‘తెలంగాణ ఆన్ ట్రాక్’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఆర్టీసీపై రామ్ మిరియాల పాడిన పాటను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. ఆర్టీసీకి 90 ఏళ్ల చరిత్ర ఉందని, ప్రజాప్రతినిధులు, మేధావులు, అధికారులు, బ్యూరో క్రాట్స్ ఎంతో మంది​ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని గుర్తు చేశారు. ఆర్టీసీ సామాన్యుడి నేస్తం అని.. ఆర్టీసీపై పాట తయారు చేయడానికి దాదాపు 2 నెలలు కష్టపడ్డామని చెప్పారు. రామ్ మిరియాల పాడిన ఈ సాంగ్  ద్వారా ప్రజల్లోకి ఆర్టీసీ మరింత బలంగా వెళ్తుందని ఆకాంక్షించారు.


ప్రైవేట్ రవాణా వ్యవస్థ పెరిగినా ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సు గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ‘తెలంగాణ ఆన్ ట్రాక్’ సాంగ్ ఉద్దేశం అని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి క్షేమంగా, భద్రంగా గమ్యం చేరుకోవాలని అన్నారు. ఆర్టీసీతో ప్రజలకు ఉన్న అవినాభావ సంబంధాన్ని రామ్ మిరియాల ఈ పాట ద్వారా చెప్పడం గొప్ప విషయం అని అన్నారు. ఆర్టీసీ మీద పాట రాయడానికి తాను పెద్దగా కష్ట పడలేదని, ఆర్టీసీతో ఉన్న బంధం గుర్తు చేసుకుని పాట రాసేశానని రామ్ మిరియాల ఈ సందర్భంగా చెప్పారు. మధ్య తరగతి కుటుంబానికి ఆర్టీసీ బస్సు అనేది ఓ నేస్తం అని అన్నారు.


సంక్రాంతి సందర్భంగా 4,233 ప్రత్యేక బస్సులు


సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం టీఎస్ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది జనవరి 7 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణ ఆర్టీసీ నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ (TSRTC) ట్వీట్ చేసింది. 


మొత్తం 4,233 స్పెషల్ బస్సు సర్వీసుల్లో 585 బస్సులకు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లుగా ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణలోని వివిధ పట్టణాలకే కాకుండా ఏపీలో డిమాండ్ ఉన్న ప్రాంతాలకు కూడా ఈ బస్సులు నడుస్తాయని చెప్పారు. హైదరాబాద్‌ బస్‌ భవన్‌ నుంచి శుక్రవారం (డిసెంబర్ 9) ఆయన తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ గతేడాది సంక్రాంతికి 3,736 ప్రత్యేక బస్సులు నడిపామని అన్నారు. ఈసారి వాటికి అదనంగా పది శాతం బస్సులను పెంచామని చెప్పారు. 


రెండు నెలల ముందే బుక్ చేసుకొనే సౌకర్యం


‘‘జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురానికి 125, కాకినాడకు 117, కందుకూరు 83, విశాఖపట్నం 65, పోలవరం 51, రాజమండ్రికి 40 చొప్పున స్పెషల్ బస్సులు నడుపుతాం. వీటితోపాటు తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం 60 రోజుల ముందుగానే టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పిస్తున్నాం. గతంలో 30 రోజుల ముందు వరకూ మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు వరకు ఈ రిజర్వేషన్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని వీసీ సజ్జనార్‌ చెప్పారు.