Hyderabad Darshini: భాగ్యనగరంలోని చారిత్రక, పర్యాటక స్థలాలను 12 గంటల్లోనే సందర్శించేందుకు వీలుగా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్ దర్శిని పేరుతో సిటీ టూర్ బస్సులతో సేవలు ప్రారంభించింది. ప్రతి శని, ఆది వారాల్లో వీటిని నడపబోతున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. కేవలం 12 గంటల సమయంలోనే హైదరాబాద్ లోని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించే విధంగా ఈ సిటీ టూర్ ఉంటుందని అధికారులు తెలిపారు.





  


ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే..?


శని, ఆది వారాల్లో సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతాయి. బిర్లా మందిర్, చౌమెహల్లా ప్యాలెస్, తారామతి బారదరిలో రిసార్ట్స్ లో మధ్యాహ్నం భోజనం అనంతరం గోల్కొండ కోటను సందర్శిస్తారు. ఆ తర్వాత దుర్గం చెరువు, కేబుల్ బ్రిడ్జి, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్కు తదితర ప్రాంతాలను సందర్శించిన తర్వాత రాత్రి 8 గంటలకు తిరిగి సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ వద్దకు చేరుకుంటారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. 






ఎవరికి ఎంత ఛార్జీలు అంటే?


మెట్రో ఎక్స్ ప్రెస్ లలో పెద్దలకు 250, పిల్లలకు 130 రూపాయలు. అలాగే మెట్రో లగ్జరీ బస్సుల్లో పెద్దలకు 450, పిల్లలు 340 రూపాయలు.