హైదరాబాద్ ఉప్పల్ లో తండ్రి కొడుకులు దారుణ హత్యకు గురి కావడం స్థానికంగా సంచలనంగా మారింది. ఉప్పల్ గాంధీ బొమ్మ వద్ద వెనకాల కాలనీలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో ఈ జంట హత్య ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం (అక్టోబరు 14) ఉదయం తెల్లవారుజామున ఈ హత్యలు జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. హతులు నరసింహ అనే 78 ఏళ్ల వ్యక్తి, శ్రీనివాస్ అనే 35 ఏళ్ల వ్యక్తి అని పోలీసులు గుర్తించారు. బ్రాహ్మణులు అయిన వీరిపై గొడ్డలితో దాడి చేసి చంపడం సంచలనంగా మారింది. తొలుత తండ్రిపై దుండగుడు దాడి చేస్తుండగా కొడుకు అడ్డువచ్చాడు. దీంతో అడ్డు వచ్చిన అతణ్ని కూడా చంపేశాడు.


ఇద్దరినీ అత్యంత పాఠశావికంగా దుండగులు హత్య చేశారు. తనను సైతం కత్తితో బెదిరించినట్లుగా ఆ ఇంట్లోని పని మనిషి చెబుతున్నారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమీపంలో బ్లూ టీ షర్టు వేసుకున్న వ్యక్తి గాంధీ బొమ్మ నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయినట్లుగా ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉప్పల్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.


వెంటనే టీమ్ లుగా విడిపోయి పలు కాలనీలు, ప్రదేశాల్లో నిందితుల కోసం చుట్టుప్రక్కల గాలించారు. హతులిద్దరు అత్యంత సౌమ్యులని, ఇరుగుపొరుగు వారితో మంచి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవని కాలనీ వాసులు చెబుతున్నారు. హత్యకు గల కారణాలను సేకరించే పనిలో క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు నిమగ్నం అయ్యారు.