తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం శుభవార్త వినిపించింది. అత్యధిక టికెట్ ఛార్జీలు ఉండే గరుడ ప్లస్ బస్సుల్లో ధరలను తగ్గించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గ‌రుడ ప్లస్ ఛార్జీలను త‌గ్గిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఖరీదైన బస్సుల్లో ప్రయాణికుల‌ు కుదుపుల్లేకుండా ఒక విలాసవంతమైన అనుభూతితో ప్రయాణాన్ని అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని వీసీ సజ్జనార్ చెప్పారు. గరుడ ప్లస్ ఏసీ బస్సుల్లో ఛార్జీలను రాజధాని బస్సుల్లో టిక్కెట్ల ధరలకు సమానంగా సవరించినట్లుగా సజ్జనార్ వివరించారు. ఈ మేరకు రాజధాని బస్సుల్లో ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించేలా ఏర్పాట్లు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. 


అయితే, ఈ తగ్గించిన కొత్త ఛార్జీలు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. అయితే, రాష్ట్రాల మధ్యలో తిరిగే బస్సు సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత పాత ధరలే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఆ మేరకు టికెట్ ధరలో మార్పులు చేసినట్లు వివరించారు. టీఎస్‌ఆర్టీసీ నిర్ణయంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్ - ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్ - భద్రాచలం మధ్య రూ. 121, హైదరాబాద్ - వరంగల్ మధ్య రూ.54 తగ్గినట్లు సజ్జనార్ వివరించారు.


అయితే, హైదరాబాద్ - బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ గరుడ ప్లస్ బస్సు సర్వీసులకు మాత్రం ఈ తాజా టికెట్ల తగ్గింపు ఆఫర్ ఇది వర్తించబోదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకొని.. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని ఎండీ స‌జ్జనార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు టీఎస్ఆర్టీసీ శత విధాలా ప్రయత్నిస్తోందని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికులు జాతర, వివాహ సీజన్‌లో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో సురక్షితంగా.. సంతోషంగా ప్రయాణం చేయడం కోసమే ఈ ఆఫర్ అందిస్తున్నట్టు ఎండీ పేర్కొన్నారు.