కర్ణాటకలో దుమారం రేగుతున్న హిజాబ్ వివాదంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల క‌విత స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టి కర్తలు అని వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందని అన్నారు. ఈ సందర్బంగా కవిత హిందీలో కాగితంపై రాసిన ఓ కవితను ఆమె తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.


నుదుటున బొట్టు పెట్టుకోవడం వ్యక్తి గత స్వేచ్ఛ అయిన సందర్భంలో.. హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తి గత స్వేచ్ఛ అవుతుందని వివరించారు. మహిళలు ఎలా ఉండాలి? ఏం ధరించాలి? ఏం చేయాలి? అనే విషయాలను ఏ మతానికి చెందిన మహిళలైనా వారి ఇష్టాఇష్టాలకే వదిలేయాలని క‌విత అభిప్రాయపడ్డారు. కల్వకుంట్ల కవిత రాసిన పూర్తి కవిత ఇదీ..


ఎమ్మెల్సీ క‌విత హిందీలో రాసి ట్వీట్ చేసినన ‘క‌విత‌’


హిందూ - ముస్లిం - సిఖ్ - ఇసాయి (క్రిస్టియన్),
మతమేదైనా కానివ్వండి.. మనమంతా ముందు భారతీయులం,
సింధూరం - టర్బన్ - హిజాబ్ - క్రాస్ గుర్తు ఏది ధరించినా మన గుర్తింపు భారతీయత మాత్రమే,
‘త్రివర్ణ పతాకాన్ని’ రూపొందించిన పింగళి వెంకయ్య అయినా,
‘జై హింద్’ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా,
‘సారే జహాన్ సే అచ్ఛా హిందూస్థాన్ హమారా’ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా,
‘జన గణ మన’తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా,
మనకు చెప్పింది ఒక్కటే.. మనం ఎవరైనా.. ఏ మతానికి చెందినా.. మనమంతా భారతీయులమనే!!