Arunachalam Giri Pradakshina: గురు పౌర్ణ‌మి సంద‌ర్భంగా ఆర్టీసీ జులై 3న అందుబాటులోకి తెచ్చిన 'అరుణాచ‌లం టూర్ ప్యాకేజీ'కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 15 ప్ర‌త్యేక సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సులను ఏర్పాటు చేయ‌గా.. 13 బ‌స్సుల్లో సీట్ల‌న్నీ ఫుల్ అయ్యాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.. మిగిలిన రెండు బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కొన‌సాగుతోందన్నారు. రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన గంట‌ల వ్య‌వ‌ధిలోని భ‌క్తులు టికెట్ల‌ను బుకింగ్ చేసుకోవడం శుభపరిణామం. ఇప్ప‌టివ‌ర‌కు హైద‌రాబాద్ నుంచి 12, వేముల‌వాడ నుంచి 2, మ‌హ‌బుబ్‌న‌గ‌ర్ నుంచి ఒక బ‌స్సును అరుణాచ‌లానికి ఏర్పాటు చేసింది టీఎస్ ఆర్టీసీ. భ‌క్తుల డిమాండ్ దృష్ట్యా మ‌రిన్నీ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమని సజ్జనార్ తెలిపారు. అరుణాచ‌ల టూర్ ప్యాకేజీ ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్ కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ tsrtconline.in ను సంప్ర‌దించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.


'ఒకరి రక్తదానం-ముగ్గురికి ప్రాణదానం’ అనే నినాదంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) రాష్ట‌వ్యాప్తంగా మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన 101 మెగా ర‌క్త‌దాన శిబిరాల‌కు అనూహ్య స్పంద‌న వ‌చ్చింది. జూన్ 27న ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 3 వరకు నిర్వ‌హించిన ర‌క్త‌దాన శిబిరాల్లో 3315 మంది స్వ‌చ్ఛందంగా ముందుకువ‌చ్చి ర‌క్త‌దానం చేశారని టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ తెలిపారు. రాష్ట్రంలోని 11 రీజియ‌న్లలోని అన్ని డిపోలు, యూనిట్ల‌లోని సిబ్బంది, ఔట్‌సోర్సింగ్ వారితో పాటు స్వ‌చ్ఛందంగా త‌ర‌లివ‌చ్చిన యువ‌త‌, మ‌హిళ‌ల నుంచి ఒక్కో యూనిట్ 350 ఎంఎల్ చొప్పున మొత్తం 3315 యూనిట్ల ర‌క్తాన్ని సేక‌రించారు.  ప్రయాణికులకు మెరుగైన, నాణ్య‌మైన, సురక్షిత సేవలను అందించడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలల్లోనూ సంస్థ భాగం కావ‌డం త‌మ‌కెంతో సంతోషంగా ఉంద‌న్నారు.


రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారితో పాటు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న రోగులను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని ఆర్టీసీ డిపోల్లో (TSRTC Depos) మంగళవారం రక్తదాన శిబిరాలను సంస్థ నిర్వ‌హించింద‌ని గుర్తు చేశారు. టీఎస్‌ఆర్టీసీ పిలుపు మేర‌కు స్వ‌చ్ఛందంగా శిబిరాల‌కు త‌ర‌లివ‌చ్చి ర‌క్త‌దానం చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం ఎంతో గొప్పదని, రక్తదానం చేసిన వారిసేవను వెలకట్టలేమంటూ ప్రశంసించారు. సామాజిక బాధ్య‌త‌గా సంస్థ సిబ్బంది, యువ‌త ముందుకు వ‌చ్చి ర‌క్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవడం మంచి పరిణామమని, టీఎస్ఆర్టీసీపై ప్ర‌జ‌ల విశ్వాస‌సాన్ని మ‌రింత‌గా పెంచేందుకు ఈ కార్య‌క్ర‌మం ఎంతగానో ఉప‌యోగ‌ప‌డుతుంది అన్నారు.
Also Read: TSRTC Special Package: టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్- అరుణాచల గిరి ప్రదక్షిణకు స్పెషల్ బస్ సర్వీస్


“ప్ర‌మాదాల్లో క్ష‌త‌గాత్రుల‌కు ర‌క్తం అత్య‌వ‌స‌ర‌ం. ర‌క్తం అందుబాటులో లేక అనేక మంది ప్రాణాలు కొల్పోతున్నారు. 3315 మంది అందించిన రక్తం ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. ఎన్నో కుటుంబాలను నిలబెడుతుంది. రక్తదానం సేవ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తుంచుకోవాలి” అని టీఎస్ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ద‌న్, ఎండీ వీసీ స‌జ్జ‌న‌ర్ సూచించారు. ఇంటి పనులు, ఆఫీసు పనులు, వ్యక్తిగత పనులు పక్కన పెట్టి, దూర ప్రాంతాల నుంచి విచ్చేసి రక్తదానం చేసిన వారు ఎంతో గొప్ప మనసున్నవారన్నారు. యువత కూడా ముందుకు వచ్చి ఈ శిబిరంలో పాల్గొని ర‌క్త‌దానం చేయ‌డం గొప్ప విషయం అన్నారు. సంస్థ నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాల‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్క సిబ్బందికి, ప్ర‌యాణీకుల‌కు, విద్యార్ధుల‌కు, యువ‌త‌కు ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial