Visakha Missing Case: విశాఖపట్నం జిల్లా గాజువాక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయిన విషయం తెలిసిందే. గాజువాకలో కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు పవన్, దిలీప్, బాలీలను పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో గుర్తించారు. అయితే ఈ ముగ్గురు విద్యార్థులకు చదువుకోవడం ఇష్టం లేక.. కళాశాల నుంచి పారిపోయి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుసుకున్నారు. 


అసలేం జరిగిందంటే..?


గాజువాకలోని శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతున్న పవన్, దిలీప్, బాలీలకు చదువు అంటే ఇష్టం లేదు. ఇదే విషయం గురించి ముగ్గురూ చర్చించుకున్నారు. ఇంట్లో ఉండి చదువుకోమంటే తల్లిదండ్రులు ఊరుకోరని.. ఇళ్ల నుంచి పారిపోదామని ప్లాన్ వేసుకున్నారు. అయితే హైదరాబాద్ వెళ్లి, పానీ పూరి అమ్ముతూ బతకొచ్చని అనుకున్నారు. ముగ్గురూ కలిపి పారిపోయేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈక్రమంలోనే ఈనెల 24వ తేదీన కుటుంబ సభ్యులకు కళాశాలకు వెళ్తున్నట్లు చెప్పి.. ముగ్గురూ ఓ చోట చేరారు. అక్కడి నుంచి రైలు ప్రయాణం చేసి సికింద్రాబాద్ చేరుకున్నారు. 


రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో.. స్నేహితులు, బంధువులు, కళాశాలకు ఫోన్ చేసి ఎంక్వైరీ చేశారు. ఎక్కడకూ రాలేదని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ముగ్గురు విద్యార్థులు అదృశ్యం అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల నుంచి దర్యాప్తు చేయగా.. ఎట్టకేలకు పోలీసులు కేసును చేదించారు. ముగ్గురు విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఉన్నట్లు గుర్తించారు. అయితే పిల్లలను సికింద్రాబాద్ నుంచి విశాఖ తీసుకొచ్చే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. 


ఇదే ఏడాది ఫిబ్రవరిలోనూ ఓ బాలిక అదృశ్యం


హైదరాబాద్ లోని తిరుమలగిరికి చెందిన మరియా అనే బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.  ఆమె పుట్టిన రోజు సందర్భంగా స్థానికంగా ఉన్న స్నేహితులు హసీనా, సక్నతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురూ కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లారు. నిన్న ఉదయం వెళ్లిన బాలికలు నేటికీ ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు వెతుకులాటలు మొదలు పెట్టారు. ఫోన్లు చేస్తుంటే ముగ్గురి ఫోన్ లు స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. ఎలాంటి ఆచూకీ లబించకపోవడంతో ఆందోళన ఎక్కువైంది. రాత్రంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన విషయమంతా పోలీసులకు వివరించి ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు బాలికల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


వర్ధన్నపేటలో కూడా ఇలాంటి ఘటనే..!


ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 20వ తేదీ రాత్రి 8వ తరగతికి చెందిన విద్యార్థి సెల్ ఫోన్ మాట్లాడడాన్ని తోటి విద్యార్థులు గమనించారు. వెంటనే వారు వార్డెన్ కు సమాచారం ఇవ్వడంతో విద్యార్థి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసుకున్నాడు. అనంతరం వార్డెన్ ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం టిఫిన్ చేసే క్రమంలో 8వ తరగతి బాలికలు ఇద్దరు.. 9వ తరగతి చెందిన మరో బాలిక కనిపించలేదు. దీంతో వారి గదిలో ఉండే విద్యార్థులను ఆరా తీయగా.. ఉదయం బయటికి వెళ్లిపోయారని చెప్పారు. వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన హాస్టల్ వద్దకు చేరుకున్నారు. బంధువులు,స్నేహితుల వద్ద వాకబు చేయగా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్డెన్ స్వరూప తెలిపారు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial