TSPSC Paper Leak Case Latest News: తెలంగాణలో సంచలనం రేపిన ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీక్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు ముమ్మరం చేశారు. పేపర్ లీకేజీ కేసులో మంగళవారం నాడు మరో నలుగురు అరెస్ట్ అయ్యారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్ నుంచి పేపర్ కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు తాజాగా అరెెస్ట్ చేశారు. వీళ్లు ప్రవీణ్ నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. తాజా అరెస్టులతో టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 27కు చేరుకుంది. 


గ్రూప్ 1 పేపర్ తో పాటు అసిస్టెంట్ ఇంజినీర్ ఏఈ పేపర్ లీకైందని తేలగా.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఏఈఈ ఎగ్జామ్ పేపర్ లీకైనట్లు సిట్ టీమ్ సోమవారం తెలిపింది. ఏఈఈ పేపర్ ను ప్రధాన నిందితుడు నుంచి కొనుగోలు చేసిన ముగ్గుర్ని సిట్ టీమ్ సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. సోమవారం ఈ ముగ్గురి అరెస్టుతో టీఎస్ పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 24కు చేరింది. ఈ కేసులో న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్‌ రెడ్డి బావ ప్రశాంత్ మినహా మిగిలిన వారిని ఒక్కక్కరిగా సిట్ టీమ్ అరెస్ట్ చేస్తోంది.  ప్రవీణ్ ఒక్కో పేపర్ ను 10 లక్షలకి ఆరుగురికి అమ్మినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కమిషన్ కార్యదర్శి పిఏ ప్రవీణ్‌, అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ తో పాటు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పేపర్లను సైతం విక్రయించి సొమ్ము చేసుకున్నాడని కొత్త కోణం వెలుగు చూసింది.


పేపర్ల లీకుతో ఆర్థిక లావాదేవిలు.. 
కేసు వివరాలు పరిశీలిస్తే... ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కుమార్‌కు 16 లక్షలు రూపాయలు అందాయి. అతను ఏఈ పేర్‌ను రేణుకా రాథోడ్‌కు అమ్మాడు. సోదరుడు రాజేశ్వర్‌ కోసం దీన్ని కొనుగోలు చేసింది.  తర్వాత రాజేశ్వర్‌, డాక్యా నాయక్‌ కలిసి ఆ పేపర్‌ను మరో ఐదుగురికి బేరం పెట్టారు. ఈ ఐదుగురిలో నిలేశ్‌ నాయక్‌ 4.95 లక్షలు, గోపాల్ నాయక్‌ 8 లక్షలు, ప్రశాంత్ రెడ్డి 7.5 లక్షలు, రాజేంద్రకుమార్ 5 లక్షలు, వెంకట జనార్దన్ 1.95 లక్షలు  ఇలా 27.4 లక్షలు ముట్టజెప్పారు. ఇందులో పది లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చారు. 


డీఏవో పేపర్‌ను ఖమ్మంలో ఉంటున్న సాయిలౌకిక్‌, సాయిసుస్మితకు ఆరు లక్షలకు అమ్మాడు ప్రవీణ్. దీంతో రెండు పేపర్లు అమ్మినందుకు ప్రవీణ్‌కు 16 లక్షలు వచ్చాయి. డాక్యానాయక్, రాజేశ్వర్‌కు 17.4 లక్షలు వచ్చినట్టు సిట్ అధికారులు తేల్చారు. వచ్చిన డబ్బులతో రాజేశ్వర్‌ కొన్ని కాంట్రాక్ట్ పనులు చేశాడని సిట్ అధికారులు కోర్టుకు తెలియజేశారు. మన్సూర్‌పల్లి తండాలో వీధిలైట్లు ఫిట్ చేయడం, డ్రైనేజీ పనులు పూర్తి చేశాడు. 4.5 లక్షలతో అప్పులు తీర్చాడు. మిగతా ఇద్దరు నిందితులు ప్రవీణ్, డాక్యా నాయక్‌ మాత్రం తమ అమౌంట్‌ను బ్యాంకులోనే ఉంచుకున్నారు. ప్రవీణ్ తన దగ్గర బంధువుకు అప్పుగా కొంత మొత్తాన్ని ఇచ్చినట్టు నివేదికలో పేర్కొన్నారు. 


మరో నిందితుడి రాజశేఖర్‌రెడ్డి కేసులో చాలా భిన్నైందని సిట్ అధికారులు పేర్కొన్నారు. బావ కళ్లల్లో ఆనందం కోసం గ్రూప్‌ 1 పేపర్‌ను ఉచితంగా ఇచ్చినట్టు దర్యాప్తులో తేలింది. ఆయనతోపాటు టీఎస్‌పీఎస్‌సీలో ఉద్యోగి అయిన షమీమ్‌కు కూడా ఫ్రీగానే పేపర్ ఇచ్చాడు. ప్రవీణ్ కూడా గ్రూప్‌ 1 పేపర్‌ను సురేష్‌, రమేష్‌కు ఉచితంగా ఇచ్చారు.