శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో ఘనంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TS RTC నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు TS RTC కార్గో పార్శిల్‌ కేంద్రాల్లో రూ.116 పే చేసి వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్‌ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.


కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత 
హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్‌ పోస్టర్‌ను టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్‌ హెడ్‌ పి. సంతోష్‌ కుమార్‌కు రూ.116 చెల్లించి, రశీదు స్వీకరించారు. తొలి ఆర్డర్ ఖరారు  చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ ప్రారంభించారు. భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో వలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు.


ఆ విశిష్టమైన తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్‌ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేసింది ఆర్టీసీ. వాటిద్వారా రూ.71 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది డిమాండ్‌ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నామని ఆర్టీసీ ఎండీ తెలిపారు.


ఈసారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకోసారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే  వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని సజ్జనార్ కోరారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను మిస్ అవకండని సజ్జనర్‌ విజ్ఞప్తి చేశారు.


సక్సెస్‌ఫుల్‌గా కార్గో పార్శిల్‌ 
నష్టాల ఊబిలో ఉన్న టీఎస్ ఆర్టీసీని లాభాల మార్గాన నడిపేందుకు అనేక మార్గాలపై దృష్టి పెడుతున్నారు సజ్జనార్. ఆర్టీసీ ఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టిన తరువాత వినూత్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టారు. ఇప్పటికే కార్గో పార్శిల్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్నవుతోంది. మేడారం సమ్మక్క, సారక్క జాతర బెల్లం ప్రసాదాన్ని (బంగారాన్ని) కార్గో పార్శిల్‌ సేవల ద్వారా పంపిణీ చేశారు. శ్రీరామ నవమికి కూడా ఇంటి వద్దకే ముత్యాల తలంబ్రాలు అనే కాన్సెప్టుని తీసుకొచ్చారు. సీతారాముల కల్యాణ తలంబ్రాలు ఇంటికే వస్తున్నాయని తెలిసిన గత యేడాది ప్రజలు పెద్ద ఎత్తున స్పందించారు. ఈసారి కూడ అదే తరహాలో రెస్పాండ్ వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.


రాష్ట్రంలోని అన్ని TS RTC కార్గో పార్శిల్‌ కౌంటర్లలో తలంబ్రాలను బుక్‌ చేసుకోవచ్చు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్‌ ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగంలోని ఫోన్‌ నంబర్లు 91 776 83 134 /  73 829 24 900 /  91 546 800 20ను సంప్రదించాలి. మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటీవ్స్ కూడా భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారు.