హైదరాబాద్‌: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ కు రాష్ట్ర మహిళా కమిషన్‌ స్వల్ప ఊరట కలిగించింది. విచారణకు హాజరుకావడంపై ఆయన విజ్ఞప్తి మేరకు మార్చి 18వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు కమిషన్‌ ప్రకటించింది. అధికార పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేసింది. 


మార్చి 15న కమిషన్ ఆఫీసులో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులలో పేర్కొంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉన్న కారణంగా తాను మార్చి 15న విచారణకు హాజరు కాలేనని మహిళా కమిషన్ కు లేఖ రాశారు. వీలు కల్పిస్తే మార్చి 18న విచారణకు హాజరు అవుతానని రిక్వెస్ట్ చేశారు. బండి సంజయ్ అభ్యర్థనపై  మహిళా కమిషన్ సానుకూలంగా స్పందించింది. ఈ 18న ఉదయం 11 గంటలకు కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని, లేకపోతే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని నోటీసు ద్వారా కమిషన్ హెచ్చరించింది. 


రాష్ట్ర మహిళా కమిషన్ కు బండి లేఖ 
మహిళా కమిషన్ కు ఎంపీ బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. మహిళా కమిషన్ ఎదుట రేపు(బుధవారం) హాజరు కాలేనని ఈ లేఖలో బండి సంజయ్  తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న కారణంగా రేపు మహిళా కమిషన్ ఎదుట హాజరు కాలేనని తెలిపారు. ఈనెల 18న (ఆదివారం) సమయమిస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. ముందుగా సమాచారం ఇచ్చే ఆ సమయానికి హాజరవుతానని చెప్పారు.   


మహిళా కమిషన్ నోటీసులు 


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజ‌య్‌ కుమార్ కు రాష్ట్ర మ‌హిళా క‌మిష‌న్ నోటీసులు జారీ చేసింది. మార్చి 15న ఉద‌యం 11 గంట‌ల‌కు కార్యాలయంలో వ్యక్తిగ‌తంగా విచారణకు హాజ‌రు కావాల‌ని మహిళా క‌మిష‌న్ బండి సంజయ్ ను ఆదేశించింది. ఓ సమావేశంలో కవితపై విమర్శలు చేస్తూ.. అభ్యంతరక వ్యాఖ్యలు చేశారని  బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది.  ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై  మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యల్ని మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. విచారణకు కూడా ఆదేశించింది. సంజయ్‌ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ మహిళా ప్రజాప్రతినిధులు జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు.


బండి సంజయ్ ఏమన్నారంటే ?


ఇటీవల బీజేపీకి సంబంధించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం కూతురు మాత్రమే గొప్ప అన్నట్లు బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన ఉందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని, తప్పు చేయకుంటే కోర్టు ద్వారా నిరూపించుకుని బయటకు రావాలని ఆయన అన్నారు. ఇంతక ముందే మీడియా వాళ్లు కవితను అరెస్ట్ చేస్తారని ఓ ప్రశ్న అడిగారని, దోషిగా తేలితే అరెస్ట్ చేయక ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా? అని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.