పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ ని ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకుని, తెలంగాణలోని తమ పరిపాలన విధానాలను... ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీ ఒకటి ఉంటే దేశంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు కేటీఆర్. 


అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు యువతకు ముందుగా క్షమాపణ చెప్పాలన్నారు. సకాలంలో తెలంగాణ ఇవ్వకపోవడంతో నీళ్లు- నిధులు- నియామకాల నినాదంతో పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరఫున క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. సోనియా గాంధీని బలిదేవత అన్న వ్యక్తి (రేవంత్ రెడ్డి)కే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలని సూచించారు.


ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, ప్రైవేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అన్నారు కేటీఆర్. పదేళ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ ఫ్రస్టేషన్ లో ఉందని వ్యాఖ్యానించారు. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా మారిందన్నారు. తప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులు అపినా, అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తున్న సొంత పార్టీ నేతలకు ప్రియాంకగాంధీ బుద్ధిచెప్పాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గాంధీ భవన్ ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


యువత ఓట్ల కోసం కాంగ్రెస్ భారీ స్కెచ్ - డిక్లరేషన్‌తో అనుకున్నది సాధిస్తారా? 
వరంగల్‌లో నిర్వహించిన సభలో రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ప్రకటింప చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రియాంకా గాంధీతో యూత్ డిక్లరేషన్ ప్రకటించేందుకు సన్నాహాలు చేశారు.  సరూర్‌నగర్‌ స్టేడియం వేదికగా 8వ తేదీన నిర్వహించ నున్న సభకు ”యువ సంఘర్షణ సభ”గా నామకరణం చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఏం చేయాలనుకుంటున్నామో.. ముఖ్యంగా యూత్‌ను ఎలా ఆదుకుంటామో ప్రియాంకాగాంధీతో ప్రకటింపచేయనున్నారని తెలుస్తోంది. 


సరూర్‌నగర్‌ స్టేడియంలో 8న నిర్వహించే ‘యువ సంఘర్షణ సభ’ విజయవంతం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  యువ సంఘర్షణ సభ విజయంతం కోసం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఆఫైర్స్‌ కమిటీతో పాటు పార్టీ అనుబంధ సంఘాల నాయులతోనూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావు ఠాక్రేలు సమావేశం నిర్వహించి.. జన సమీకరణలో ప్రతి నాయకుడు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. 


విద్యా ర్థులు, నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని వారిని ఆదుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ చెబుతోంది.  ఎలా ఆదుకుం టామో యూత్‌ డిక్లరేషన్‌లో పొందుపరచనున్నారు.   యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగులకు న్యాయం చేస్తామని  మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇవ్వనుంది.   తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. వాటిని భర్తీ చేయడం లేదని..తాము రాగానే భర్తీ చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విద్యార్థి, నిరుద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటికి మద్ధతుగా ఉంటుందని చెప్పేలా సభ నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు.