TS Minister Harish Rao satires on Rahul Gandhi:  ఖమ్మం జనగర్జన సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేశారు. దొర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేంది కాంగ్రెస్ పార్టీ అని, కర్ణాటక సీన్ తెలంగాణలో రిపీట్ చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్ అంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రం గురించి ఏ మాత్రం అవగాహన లేని నేత రాహుల్ గాంధీ అని, పోడు భూములకు తాము పట్టాలు ఇచ్చిన తరువాత మీరు ఇంక ఇచ్చేది ఏముందని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. పలు విషయాలను ప్రస్తావిస్తూ రాహుల్ కు చురకులంటిస్తూ మంత్రి హరీష్ ట్వీట్ చేశారు. 


హరీష్ రావు ట్వీట్ లో ప్రస్తావించిన అంశాలివే.. 
‘రాహుల్ గాంధీ గారు.. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది. అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టిందన్నారు. బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీమ్. ప్రజల సంక్షేమం చూసే ఏ క్లాస్ టీం అన్నారు. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కు లేదు అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పుట్టిందని’ హరీష్ పేర్కొన్నారు. 


‘రాష్ట్రంలో పోడు భూములకు పట్టాల పంపిణీ కాంగ్రెస్ నేతల కళ్లకు కనిపించలేదా..?. మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ అని సెటైర్లు వేశారు హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు మొత్తం 80,321.57 కోట్లు అయితే, మొత్తం ఖర్చే లక్షకోట్లు దాటకపోతే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా? అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు హరీష్.






స్కీమ్ ల్లోని స్కాం ల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే అన్నారు. అప్పుడే ముదిగొండ కాల్పులను మరిచిపోయారా? భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడుగుతే పిట్టల్లా కాల్చి చంపినోళ్లు మీరు.. అలాంటి కాంగ్రెస్ నేతలు ఖమ్మంలో కల్లిబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఖ‌మ్మం స‌భ ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్ట్ తో రాహుల్ స్కిట్’ అని హరీష్ రావు ట్వీట్ చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial