Munugode By-Election: మునుగోడు ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ న్యాయ పోరాటానికి దిగింది. టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు పోలిన మరో 8 గుర్తులను తొలగించాలన్న అంశంపై హైకోర్టు గడప తొక్కింది. హౌస్ మోషన్ విచారణ చేపట్టాలని కోరగా.. హైకోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. మునగోడు ఉప ఎన్నిక గుర్తుల జాబితా నుండి ఓడ, డోలీ, కెమెరా, రోడ్ రోలర్, టీవీ, కుట్టు మిషన్, చపాతీ రోలర్, సబ్బు డబ్బా గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల 10 వ తేదీన ఎన్నికల కమిషన్ ను టీఆర్ఎస్ కోరింది. అయితే టీఆర్ఎస్ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం నుండి స్పందన రాలేదు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానం ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించే ప్రయత్నాలు చేస్తోంది. న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధపడింది. 


గతంలో 2018 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కంటే కూడా స్వంతత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని అంట్లోంది. కారును పోలి ఉన్నందు వల్లే వాళ్లు గెలవగలిగారని ఈసీకీ వివరిస్తోంది. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్ లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్సీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. అలాగే నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువా, నాగార్జున సాగర్ లలో కమెరా గుర్తుకు కూడా బీఎస్సీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయన్నారు. ఈ క్రమంలోనే ఈ 8 గుర్తులను తొలగించాలని కోరారు. 


ఇటీవల ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన అధికారులు


ఎన్నికల కోడ్‌ ఉండగానే సీఎం కేసీఆర్‌పై అసత్య ప్రచారం చేస్తున్న బీజేపీ లీడర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. బుద్ధ భవన్‌లో సీఈఓ వికాస్ రాజ్‌ని కలిసిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్,టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి జనరల్  సోమ భరత్ కుమార్ వినతి పత్రం అందజేశారు. అదే టైంలో టిఆర్ఎస్ పార్టీ కారు గుర్తును పోలిన గుర్తులను ఫ్రీజాబితా నుంచి తొలగించాలని అభ్యర్థించారు. 


సీఎం కేసీఆర్ క్షుద్రపూజలు చేశారంటూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై చర్యల తీసుకోవాలని సీఈఓకి ఫిర్యాదు చేశారు టీఆర్‌ఎస్ లీడర్లు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఆయనకు పిచ్చి పట్టిందన్నారు. దేవుడితో సమానమైన సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పిచ్చి పట్టిన సంజయ్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఆయన పద్ధతి మార్చుకునేలా లేరని...  అందుకే సీఈఓ కలిసి ఫిర్యాదు చేశామన్నారు. బీజేపీకి రోజురోజుకు తెలంగాణలో ఆదరణ తగ్గుతోందని అందుకే ఇలాంటి కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ భాను ప్రకాశ్.


కారు గుర్తును పోలిన గుర్తులు ఎనిమిది ఫ్రీజాబితాలో ఉన్నాయని దీని వల్ల తమకు చాలా నష్టం వాటిల్లోతందిని అభిప్రాయపడ్డారు టీఆర్‌ఎస్‌ నేతలు. వాటిని తొలగించి జాబితా రూపొదించాలని రిక్వస్ట్ చేశారు. గతంలో కారును పోలిన సింబల్స్‌తో స్వల్ప మెజార్టీతో తమ అభ్యర్థులు ఓడిపోయారని గుర్తు చేశారు. అందుకే అలాంటి 8 గుర్తులు తొలగించాలని కోరామన్నారు వినయ్‌ భాస్కర్. ఎన్నికల అధికారికి ఆధారాలు కూడా సమర్పించామని అన్నారు.