TRS MLAs Buying Case: తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల కోనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురులో ఒకరు అయిన నంద కుమార్.. ఆయన ఫాం హౌజ్ కు ఎందుకు వెళ్లారో తెలియజేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. పూజల కోసం మాత్రమే తాము ఫాం హౌస్ కు వెళ్లినట్లు వివరించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియది చెప్పుకొచ్చారు. అంతే కాకుండా అక్కడ ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే తనకు తెలుసని నంద కుమార్ పేర్కొన్నారు. మిగతా ముగ్గురు వ్యక్తులు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సింహయాజి స్వామీజీతో సామ్రాజ్య లక్ష్మి పూజ జరిపించడానికి బేరసారాలు జరిపినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.


అసలు స్కాం గురించే తెలియదు..


అసలు స్కాం గురించి తమకు ఏమాత్రం తెలియదని నందకుమార్ వివరించారు. న్యాయాన్ని నమ్ముతున్నామని, న్యాయ స్థానంలో న్యాయం గెలిచిందని వివరించారు. త్వరలో మీడియాకు అన్ని వివరాలు వెల్లడిస్తామని అన్నారు. అయితే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించిన కేసులో ముగ్గురు నిందితులకు ఏసీబీ కోర్టు రిమాండ్ తిరస్కరించడంతో పోలీసులు తర్వాతి చర్యలు ఏం చేపడతారనేది ఆసక్తిగా మారింది. 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వారిని విచారించే అంశంపై పోలీసు అధికారులు దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. 


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డబ్బులు చెల్లించి కొనేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ముగ్గురు నిందితులపై సైబరాబాద్‌ పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ముగ్గురు నిందితులపై 120-బీ, 171-బీ రెడ్‌ విత్‌ 171-ఈ, 506 రెడ్‌ విత్‌ 34 ఐపీసీ, సెక్షన్‌ 8 ఆఫ్‌ ప్రివెన్షన్‌ కరప్షన్‌ యాక్ట్- 1988 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల వద్ద రూ. కోట్ల డబ్బు ఉందని ప్రచారం జరిగినా కానీ, పక్కా ఆధారాలను పోలీసులు సమర్పించలేదు. కానీ జాతీయ స్థాయిలో ఒక కీలక నాయకుడి సెక్రటరీ మాట్లాడిన ఆడియో టేపులు లభించాయని పోలీసు వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 


రూ.50 కోట్లు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని ఫిర్యాదు..


టీఆర్ఎస్ (TRS) ను వీడి బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డికి రూ.100 కోట్లు, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌ రెడ్డికి ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇస్తామంటూ ప్రలోభ పెట్టారని స్వయంగా రోహిత్‌ రెడ్డే ఫిర్యాదు ఇచ్చారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మేరకు రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లను అరెస్టు చేసి విచారణ చేశారు.


రోహిత్‌ రెడ్డి ఫాంహౌస్‌ ప్రాంతాన్ని సైబరాబాద్‌ పోలీసులు (Cyberabad Police) తమ అధీనంలోకి తీసుకుని విస్తృతంగా తనిఖీలు చేశారు. డబ్బు ఎక్కడైనా దాచారా అనే అనుమానంతో క్షుణ్ణంగా పరిశీలించారు. నిందితులు వినియోగించిన కారు డ్రైవర్‌ తిరుపతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.