ఓ యువతి యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. ఇందులో కొత్తేం ఉంది ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే కదా అనుకోకండి. ముందుంది అసలు ట్విస్ట్. ఆ తరువాత తన భర్తకు మరో యువతితో పెళ్లి చేసింది. అది కాస్తా గొడవలకు దారి తీసింది. బంజారాహిల్స్‌లోని సింగాడికుంట బస్తీకి చెందిన 20 ఏళ్ల యువతి హోం ట్యూటర్‌గా పనిచేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన గాంధీ యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునేవాడు. 


వీరికి 2020లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దాదాపు మూడేళ్ల పాటు ప్రేమించుకున్నారు. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. పిల్లల ఇష్టాలను గౌరవిస్తూ ఇరువర్గాల పెద్దలు వారి పెళ్లికి అంగీకరించారు. గ్రాండ్‌గా నిశ్చితార్థం చేశారు. ఎట్టకేలకు పెళ్లికూడా నిశ్చయం అవడంతో గాంధీ, ఆ యువతి హైదరాబాదులో సహజీవనం చేశారు. 


కొద్ది కాలం తరువాత గాంధీ, ఆ యువతి మధ్య విభేదాలు వచ్చాయి. ఇంతలో గాంధీకి మరో అమ్మాయితో పరిచయం ఉందని గుర్తించిన  అతన్ని నిలదీసింది కాబోయే భార్య. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించింది. ఈ విషయంపై ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు రావడంతో గొడవలు పడి పోలీసులు వరకు వెళ్లారు.  


అప్పుడే పాత ఫ్రెండ్‌ ఎంట్రీ ఇచ్చింది. తన మెదడుకు పని చెప్పింది. తాను గాంధీ స్నేహితులమని ఇరు కుటుంబాలను నమ్మించింది. రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చింది. పెద్దల సమక్షంలో దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకుంది. తానే పెళ్లి పెద్ద అయ్యి గత మే 14న గాంధీకి నిశ్చితార్థమైన అమ్మాయితో పెళ్లి చేయించింది. కొద్ది కాలం వారి సంసారం హ్యాపీగానే గడిచింది. ఆ తరువాత గాంధీ ఇంటికి ఆలస్యంగా వచ్చేవాడు. ప్రశ్నిస్తే కొట్టేవాడు. అసలు విషయం తెసుకునేందుకు భార్య నిఘా పెట్టింది. విచారణలో ఆమెకు సంచలన విషయాలు తెలిశాయి.


గాంధీ, పాత స్నేహితురాలు కొద్ది కాలంగా ప్రేమించున్నట్లు తెలుసుకుంది. ఎవరికీ తెలియకుండా పెళ్లి కూడా చేసుకున్నట్లు తేలింది. ఈ విషయాన్ని దాచి తనకు గాంధీకి పెళ్లి చేసిందని తెలుసుకుంది భార్య. కొద్ది కాలంగా ఆమె వద్దకు గాంధీ వెళ్తున్నట్లు తెలుసుకుంది. అందుకే ఇంటికి లేటుగా వచ్చేవాడని నిర్ధారించుకుంది. ఈ విషయంపై గాంధీని భార్య నిలదీసింది. అయితే అసలు విషయం బయట పడడంతో పాత స్నేహితురాలు రోడ్డుపైకి వచ్చింది. గాంధీని తానే ముందు పెళ్లి చేసుకున్నానని, అతడు లేకపోతే ఉండలేను అంది.


రెండో భార్య బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో ఉన్నట్లు తెలుసుకున్న పాత స్నేహితురాలు తన మద్దతుదారులైన సుజ్జి, సంజీవ్‌, విజయ్‌, అనంత, జెస్సికాలతో అక్కడికి వచ్చింది. గాంధీ తనను పెళ్లి చేసుకున్నాడని, తనకూ న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. దీంతో ప్రస్తుత భార్య మంగళవారం రాత్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాంధీ, అతని స్నేహితురాలిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial